భారత జట్టు కొత్త కోచ్ నియామకం కొరకు స్వీకరించిన దరఖాస్తులను బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా కమిటీ పరిశీలించింది. కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామితో కూడిన క్రికెట్ సలహా కమిటీ కి కోచ్ ఎంపిక బాధ్యతలును బీసీసీఐ అప్పగించింది. కమిటీ ఆరుగురితో కూడిన తుది జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.ఆగస్టు 16, శుక్రవారం నాడు కోచ్ పదవి కోసం ఎంపిక చేసిన ఆరుగురికి ఇంటర్వూలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కోచ్ గా ఉన్న రవిశాస్త్రి తో పాటు రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుత్, టామ్ మూడీ, మైక్ హెస్సన్, ఫిల్ సిమన్స్ లను నేరుగా ఇంటర్వూలకు పిలవనున్నారు.
ముంబయి లోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో క్రికెట్ సలహా కమిటీ ఈ ఇంటర్వూలను నిర్వహించనుంది. ఇప్పటికే కమిటీ ఈ ఆరుగురికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ముంబయి రాలేని వారికీ స్కైప్ ద్వారా మాట్లాడి ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి సైతం ఈ పద్దతిలోనే ఇంటర్వూలో పాల్గోనబోతున్నట్టు తెలుస్తుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి మళ్ళీ రవిశాస్త్రినే కోచ్ గా కోరుకుంటునప్పటికీ, ఈసారి టామ్ మూడీ, మైక్ హెస్సన్ రూపంలో అతనికి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. జట్టుకి అవసరమైన సహాయ కోచ్ లు, ఇతర సిబ్బంది కోసం భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కె ప్రసాద్ ఇంటర్వూలు నిర్వహించబోతున్నాడు. కోచ్ పదవికి మొత్తం రెండు వేల దరఖాస్తుల వచ్చినట్టు సమాచారం. ఇంటర్వూలు ముగిసిన మొదటి వారం లోపలే బీసీసీఐ కొత్త కోచ్ పేరును ప్రకటించనుంది.