తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం శ్రీ ధన్వంతరి నారాయణ మహాగణపతిగా గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ విగ్రహానికి ఓ వైపు లక్ష్మిదేవి, మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సంవత్సరం 9 అడుగుల ఎత్తు ఉండే విగ్రహాన్ని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతిష్టించింది. 11 రోజుల పాటుగా కమిటీ సభ్యులు మాత్రమే పూజలు నిర్వహిస్తారని, కరోనా కారణంగా దర్శనానికి భక్తులను అనుమతించడం లేదని చెప్పారు. www.ganapathideva.org వెబ్ సైట్ ద్వారా పూజా కార్యక్రమాల నిర్వహణ, దర్శనం ఏర్పాట్లు చేసినట్టు కమిటీ ప్రకటించింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె. చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్ధించారు. అలాగే వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. “విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు. విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనా కష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధిస్తూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు” అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu