తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్ రెడ్డి నియామకానికి ఆమోద ముద్ర వేశారు. గురువారం తన నిర్ణయాన్ని వెల్లడించారు. త్వరలోనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా కూడా పలువురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని అనిత రాజేంద్ర, అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజనీ కుమారి, వై రామ్మోహన్ రావు, యాదయ్యలను ప్రభుత్వం టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించింది. ఇక టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం 62 ఏళ్లు దాటిన వారు చైర్మన్ పదవికి అనర్హులు. త్వరలోనే మహేందర్ రెడ్డికి 62 ఏళ్లు పూర్తికానున్నాయి. దీంతో ఈ ఏడాది డిసెంబర్ వరకే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది.
కొద్దిరోజుల క్రితం టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈక్రమంలో చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు.. సభ్యుల పదవులకి 320కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించారు. అప్లికేషన్లు పరిశీలించి చివరికి టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్గా మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. డీజీపీగా పనిచేసి రిటైర్ అయిన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న వారిలో మహేందర్ రెడ్డి ఒక్కరే ఉండగా.. ఆయననే ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమోదం కోసం మహేందర్ రెడ్డి పేరును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకానికి తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.
ఇకపోతే ఖమ్మం జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి 1968 బ్యాచ్కు చెందిన పోలీస్ సర్వీస్ అధికారి. ఏఎస్పీగా మహేందర్ రెడ్డి తన కెరీర్ను మొదలు పెట్టారు. 2017లో తెలంగాణ డీజీపీగా అనురాగ్ శర్మ పదవీవిరమణ చేసిన తర్వాత.. మహేందర్ రెడ్డి డీజీపీగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్లో డీజీపీగా పదవీ విరమణ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE