తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికలలో సోనియా గాంధీ పోటీ చేయనున్నారన్న వార్తలు ఇటీవల వినిపిస్తున్నాయి. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఎన్ని నియోజకవర్గాలు సోనియా కోసం రిజర్వ్ లో ఉన్నాయనే విషయాలు ఇంకా చర్చకు రాలేదు కానీ.. పోటీ చేస్తారన్నవార్తలు మాత్రం బాగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు కావాలనే తెరమీదకు తీసుకువచ్చినట్లు తెలుస్తుంది.
తెలంగాణా నుంచి సోనియా ఎంపీగా బరిలో దిగితే ఆ ప్రభావంతో మరిన్ని ఎంపీ సీట్లు గెలవచ్చని కాంగ్రెస్ నేతల ఆశిస్తున్నారు. ఈ ప్రభావం ఒక్క తెలంగాణలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల మీద కూడా ఉంటుందని వారు భావిస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ను పక్కను పెట్టి అక్కడ పాగా వేయాలంటే ఇలాంటి అద్భుతమేదయినా జరగాలని కోరుకుంటున్నారు. దీంతోనే టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సోనియా పోటీ అంశాన్ని లేవనెత్తారు.
అంతేకాదు సోనియా గాంధీ కోసం 4 కీలక నియోజకవర్గాలను కూడా కాంగ్రెస్ నేతలు డిసైడ్ చేసేసారు. అందులో మొదటిది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అయిన మల్కాజ్ గిరి. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి పట్టు ఉండటంతో పాటు తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో ఖచ్చితంగా సోనియాగాంధీ గెలుస్తుందని ఇక్కడి నేతలు భావిస్తున్నారు.
ఇక రెండో ఆప్షన్ మెదక్ లోక్ సభ నియోజకవర్గం. అక్కడ నుంచి అయినా సోనియా పోటీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. 1980లో మెదక్ నుంచి స్వర్గీయ ఇందిరా గాంధీ పోటీ చేసి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. సోనియా కూడా గెలుస్తుందని భావిస్తున్నారు. అలాగే తెలంగాణ ఇచ్చింది సోనియానే కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుందన్న భావన వారిలో బాగా ఉంది.మరోవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి , తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీకి మంచి పేరుంది కనుక కరీంనగర్ నుంచి పోటీ చేసినా కూడా సోనియా గాంధీ గెలుస్తారని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అలాగే సోనియా పోటీ చేయడానికి నాలుగో పార్లమెంట్ స్థానంగా చేవెళ్లను చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు బలం, బలగం మెండుగా ఉండంటంతో పాటు.. చేవెళ్ల ప్రాంతం అంటే కాంగ్రెస్కి బాగా సెంటిమెంట్ ఉంది. అంతేకాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జ్గా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉండటంతో.. సోనియా అక్కడ నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని అనుకుంటున్నారు.
అయితే కాంగ్రెస్ నేతలు లెక్కలేసినంత ఈజీగా ఓటర్లు సోనియా గాంధీకి ఓట్లు వేసే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్పై కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సాధించినాకూడా కేవలం అధికారానికి కావాల్సిన ఓట్లు మాత్రమే వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఈ ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ మీదున్న కోపంతో వేసారు తప్ప కాంగ్రెస్ మీద మమకారంతో కాదన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకోవాలని అంటున్నారు.
ఇలాంటి సమయంలో సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయిస్తే ఉన్న పరువు పోవడం తప్ప గెలవడం అనేది ఉండదని విశ్లేషకుల మాట. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన కేసీఆర్.. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో ఓడిపోయారు. అలాంటిది తెలంగాణను ఇచ్చింది సోనియా అంటే ఓట్లు రాలే పరిస్థితి ఇప్పుడు లేదన్నది తెలుసుకోవాలని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేడర్ను ఉత్సాహపరచడానికి పీసీసీ స్కెచ్ తప్ప వేరే ఏమీ లేదని చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY