ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ.. రేవంత్ రెడ్డి భిన్నమైన పద్ధతిలో పాలన సాగిస్తున్నారు. ఆయన వేసే ప్రతీ అడుగు.. చెప్పే మాట.. ప్రజల కోసమే అయి ఉంటోంది. ప్రజావాణి, ప్రజాపాలన.. ఇలా పథకాలు, కార్యక్రమాల్లోనూ ప్రజలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా వ్యక్తుల పేర్లు కాకుండా.. విభిన్న తరహాలో ఆలోచిస్తున్నారు. అలాగే అధికారుల సమావేశంలోనూ., పార్టీ కార్యక్రమాలలోనూ అలాగే వ్యవహరిస్తున్నారు. మంత్రులు కూడా ప్రజాపాలన గురించే ఆలోచించేలా దిశా నిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా ఆర్..ఆర్..ఆర్ మూవీ అందరినీ ఆకట్టుకున్నట్లుగానే.. రేవంత్ (ఆర్) రెడ్డి (ఆర్) కూడా రంజింప(ఆర్)చేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతుల వ్యవసాయ కనెక్షన్లను తనిఖీలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు? తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చిందెరు? అని ట్రాన్స్కో సీఎండీ రిజ్వీని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా? లేదా? అని ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క తో కూడా దీనిపై స్పందించారు. వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన అంశంపై పూర్తి వివరాలు సేకరించి, శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం డైరెక్టర్ (ఆపరేషన్స్) జె.శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. వెంటనే శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలగించారు. ఎస్ఈని బదిలీ చేశారు. దీని ద్వారా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలను పీకేసేందుకు వెనుకాడబోమన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపారు.
నిబంధనలకు విరుద్ధంగా, ప్రభుత్వ ఆదేశానుసారం కాకుండా వ్యక్తిగత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులు పెట్టేవారిని శిక్షిస్తామని చెబుతూనే.. అక్రమాల అణచివేత విషయంలో అధికారులపై ప్రభుత్వ పెత్తనం ఉండదని వెల్లడిస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో పోలీసులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదని, తాము పాలకులం కాబట్టి పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమంలో రేవంత్ వ్యవహార శైలి పోలీసు అధికారులను కట్టిపడేసింది. ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకొనిపోతామని, రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలు వినమ్రంగా స్వీకరిస్తామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సూచించారు. సైబర్ క్రైంను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని అభినందించారు.
ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల రివ్యూ సమావేశాల్లోనూ అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. అర్హులెవరూ నష్టపోకుండా చూడాలని, అవసరమైతే క్షేత్ర స్థాయి లో రెండు, మూడు సార్లు పరిశీలన చెబుతున్నారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లోగానీ, తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోగానీ మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్యారంటీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని, దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. ఎవరైనా దరఖాస్తు చేయనివారు ఉంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని ఆదేశించారు… ఇలా అన్ని అంశాల్లోనూ ప్రజలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE