తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. దేశానికి కాంగ్రెస్తోనే మేలు జరుగుతుందని బలంగా నమ్ముతున్నానని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా, రాహుల్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నానని పేర్కొన్నారు. అయితే, తనకు వచ్చిన ఇబ్బందల్లా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడితోనేనని తెలిపారు. పంచాయితీ ఏదైనా ఉంటే.. అది నాకు, రేవంత్ రెడ్డికి మధ్యనని, పార్టీతో ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్లో అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఉందని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలియజేసే వీలుంటుందని జగ్గారెడ్డి అన్నారు.
కాగా, పదవి నుంచి తనను తప్పించటంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. దానిని స్పోర్టివ్గా తీసుకుంటానన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జి బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తప్పించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో చాల రోజులుగా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, నేను కాంగ్రెస్ పార్టీకి విధేయుడినని తెలిపారు. మెదక్ జిల్లా పర్యటన గురించి తనకు సమాచారం లేదని, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనను పిలవలేదని వెల్లడించారు. రేవంత్ అసలు స్వరూపం త్వరలోనే బయట పెడుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని అనేకసార్లు చెప్పానని.. ఇప్పుడు కూడా ఆ మాట మీదే నిలబడతానని స్ఫష్టం చేశారు. కాగా పీసీసీ పదవిని తాను కూడా ఆశించానని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్తో తనకెలాంటి విబేధాలు లేవు అని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ