తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఈరోజు పరిశ్రమల శాఖ పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటిదాకా పరిశ్రమల కోసం భూములను తీసుకొని నిరుపయోగంగా ఉన్న వాటిపైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటిఆర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి వాటిని ప్రారంభమయ్యేలా చూసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పెట్టుబడులు తేస్తున్నామని, అయితే కంపెనీలు సైతం ఇచ్చిన హామీ మేరకు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఈ మేరకు నిర్ణీత గడువు లోపల కార్యకలాపాలు ప్రారంభించని వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. దీంతో పాటు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పేరుతో మార్పిడి చేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి కూడా మంత్రి సమీక్ష జరిపారు. ఇలా కార్యకలాపాలు ప్రారంభం కానీ కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు.
దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని పరిశ్రమలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట చేర్చాలని, ఇందుకోసం ఒక బ్లూ బుక్ ని తయారు చేయాలని సూచించారు. ఇందులో అన్ని పరిశ్రమల సమగ్ర సమాచారం ఉండేలా చూడాలని సూచించారు. ఆయా కంపెనీలు నిర్వహిస్తున్న వారి వివరాలు, పరిశ్రమల కేటగిరీలతో(సూక్ష్మ, ఎంఎస్ఎంఈ) పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ వర్గాల్లో ఉన్న సమ్మిళిత స్ఫూర్తి తెలుస్తుందన్నారు. ఇలాంటి సమాచారంతో ప్రభుత్వం వద్ద కంపెనీలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందుబాటు ఉంటే ఇతర కార్యక్రమాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పైన సమీక్ష:
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన ఈ-ఎస్ఎఫ్ సి డిజిటల్ ప్లాట్ ఫామ్ ని మంత్రి కేటిఆర్ లాంచ్ చేశారు. దీంతో పాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించి, కార్పోరేషన్ కార్యకలాపాలను మరింతగా విస్తరించే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీని కోసం ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన అంశాన్ని కూడా చర్చించి, ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటిఆర్ పలు సూచనలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu