తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం నాడు ప్రగతి భవన్ లో రెండో రోజు జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.
ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ధి చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హతమేరకు అందులో భూమిని కేటాయించాలని నిర్ణయించారు. తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించారు.
వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు మరియు డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయం. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం జూలై 12 వరకు వున్న ఆఖరు తేదీని జూలై 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ పాలసీలో రూపొందించిన మార్గదర్శకాలపై కేబినెట్ చర్చించింది.
రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి మరియు మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని కేబినెట్ నిర్ధారించింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కల్పించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో స్థాపించే యూనిట్లకు అందించే పలు విధాల రాయితీలు:
- కరెంటు సబ్సిడీని ప్రతి యూనిట్ కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా అందించాలని నిర్ణయించింది.
- పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్ లోన్ పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75 శాతం వడ్డీని (రెండు కోట్లకు మించకుండా) రీయింబర్స్ చేయాలని నిర్ణయం.
- మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రీయింబర్స్ మెంట్ చేయాలని నిర్ణయం.
- ఆహార ఉత్పత్తులను, స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమిని కేటాయించి వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటునందించాలని నిర్ణయించింది.
వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధనపు ప్రోత్సాహకాలందించాలని కేబినెట్ నిర్ణయించింది.పైన తెలిపిన సాధారణ ప్రోత్సాహకాలకు అదనంగా:
- 15 శాతం మూలధనాన్ని(20 లక్షలకు మించకుండా) మంజూరు చేయాలని నిర్ణయించింది.
- మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబర్స్ మెంట్ (85 శాతం) (రెండు కోట్ల వడ్డీకి మించకుండా)
- అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ (20 లక్షలకు మించకుండా సబ్సిడీ)
స్వయం సహాయక సంఘాలు మరియు రైతు సంఘాలకు (ఎఫ్.పీ.ఓ) లకు కూడా అధనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా (పైన తెలిపిన సాధారణ ప్రోత్సాహకాలకు అధనంగా)
- 15 శాతం మూల ధనం మంజూరు (రూ.1 కోటి మించకుండా) చేయాలని నిర్ణయం
- మూలధనం లోన్ పై చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం రీయింబర్స్ మెంట్ (80 శాతం) (రెండు కోట్ల వడ్డీకి మించకుండా)
- భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ (20 లక్షలకు మించకుండా) అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ