త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఈ రోజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచాలనే ఉద్దేశంతోనే వార్డుల విభజన చేశారని కోదండరాం మండిపడ్డారు. రిజర్వేషన్లను అధికార పార్టీకి అనుకూలంగా ఖరారు చేసుకున్నారని విమర్శించారు. ఈనెల 8న జాతీయస్థాయిలో జరిగే గ్రామీణ భారత రైతు బంద్కు టిజెఎస్ మద్దతిస్తుందని చెప్పారు.
మిలియన్ మార్చ్ సందర్భంగా మస్తాక్పై పెట్టిన కేసును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఢిల్లీలోని జేఎన్యూలో జరిగిన ఘటనను కోదండరాం తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై దాడులు చేయటం అనైతికచర్య అని అన్నారు. జేఎన్యూ పూర్వ విద్యార్థిగా, ఒక ప్రొఫెసర్గా యూనివర్సిటీలో విద్యార్థులపై ఇలాంటి దాడులు బాధ కలిగించాయని చెప్పారు. జేఎన్యూలో ఇటువంటి హింసాత్మక ఘటనకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని కోదండరాం డిమాండ్ చేశారు.
[subscribe]