హైదరాబాద్ శివారు ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి జరుగుతున్న ఈ వేడుకలను వీక్షించేందుకు సామాన్య భక్తజనంతో పాటు అనేకమంది ప్రముఖులు విచేస్తుండటం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ముగియనున్న వేడుకలలో ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఆయనతోపాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ఆశ్రమ ప్రాంగణంలోని దివ్యదేశాలను.. అదేవిధంగా ‘సమతామూర్తి’ విగ్రహాన్ని సందర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖులు ప్రసంగించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇప్పటివరకు 7 వింతలు ఉన్నాయి. అయితే ఇకనుంచి 8వ వింతగా శ్రీరామానుజాచార్యుల ‘సమతామూర్తి’ విగ్రహం నిలవనుందని అన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చినజీయర్ స్వామి వారిని కొనియాడారు. ప్రధానితో సహా ఎందరో ప్రముఖులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ముఖ్య కారణం.. ‘సమతామూర్తి’ యొక్క స్ఫూర్తిని అందరికీ తెలియజేయటం కోసమే, అందరికీ పంచటంకోసమే అని తెలిపారు.
‘జై శ్రీమన్నారాయణ’ అంటూ ప్రసంగం ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. చినజీయర్ స్వామి వారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నాకు లభించిన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను అని తెలిపారు. చినజీయర్ స్వామి అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు. సమతామూర్తి కేంద్రం మన తెలుగు రాష్ట్రంలో ఏర్పాటు కావడం మనందరి అదృష్టం అని అన్నారు. భవిష్యత్తులో కొన్నివేల సంవత్సరాలపాటు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వమానవ సమానత్వం కోసం పాటుపడిన శ్రీ రామానుజాచార్యుల వారి అడుగుజాడలలో సర్వ మానవాళి నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ