తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు ఎల్బీనగర్ జోన్లో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) ద్వారా రూ.7.26 కోట్ల వ్యయంతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు చేపట్టిన బాక్స్ డ్రైన్ పనులు పూర్తికావడంతో మంత్రి కేటీఆర్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన జంతువుల (స్మాల్ యానిమల్ ) దహన వాటికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పీపుల్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి జీహెఛ్ఎంసీ ఈ దహనవాటికను ఏర్పాటు చేసింది.
అలాగే ఫతుల్లాగూడలో ముక్తిఘాట్/ మల్టీ-ఫెయిత్ వైకుంఠదామాన్ని కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ముక్తి ఘాట్ ను 6.5 ఎకరాలలో హిందువులు, ముస్లింలు మరియు క్రైస్తవుల కోసం హెఛ్ఎండీఏ అభివృద్ధి చేసింది, ప్రతి కమ్యూనిటీకి ఇందులో ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెఛ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో రూ.55 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎస్ఎన్డీపీ పథకం కింద జీహెచ్ఎంసీ పరిధిలో 34 పనులు చేపడుతుండగా, ఇందులో రెండు పూర్తయ్యాయని, మరో 17 డిసెంబర్ చివరి నాటికి, మరో 15 పనులు జనవరి వరకు పూర్తవుతాయన్నారు. ఎస్ఆర్డీపీ కింద ఎల్బీసీ నగర్ చౌరస్తా రూపు రేఖలు ఎలా మారాయో, ఎస్ఎన్డీపీ కింద నగరం నలుమూలలా ఉండే నాలాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో రూ.985 కోట్లతో మొదటి దశలో పనులు చేపడుతున్నామన్నారు. ఎస్ఎన్డీపీ రెండో దశ పనులు కూడా చేపడుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎల్బీ నగర్ చోరస్తా ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది అనే ఒకే ఒక ఉదాహరణ ఎల్బీనగర్ కోసం ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పటానికి చాలు అన్నారు. అదేవిధంగా అటు నాగోల్, ఇటు ఎల్బీ నగర్ వరకు మెట్రో పూర్తయ్యింది. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మధ్యలో ఉండే ఐదు కిలోమీటర్ల మార్గాన్ని కలిపే ప్రయత్నం రెండో ఫేజ్లో చేస్తున్నాం, దాన్ని కూడా తప్పకుండా కలుపుతామని మంత్రి పేర్కొన్నారు.
మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే:
“వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం. ప్రెస్ వాళ్ళు రేపే చేస్తామని చేయలేదని అంటారు. ముందుగానే చెబుతున్నా, నాకు తెలుసు, మీకు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోను విస్తరించే ప్రయత్నాన్ని బ్రహ్మాండంగా చేస్తాం. ఆ దిశగా ప్రజారవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి నాయకత్వంలో మరో మంచి కార్యక్రమం జరగబోతుంది. ఒక 1500 పడకల టిమ్స్ హాస్పిటల్ గడ్డి అన్నారంలో రాబోతుంది. ఈ ప్రాంతంలో పేదలందరికీ మంచి సౌకర్యం అందనుంది. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE