పవన్ కల్యాణ్.. ఆపేరులోనే పవర్ ఉండేది. రీల్ లైఫ్లో పవర్స్టార్గా పేరుంది. ఆ ఒక్క విషయంలో తప్పా.. రియల్ లైఫ్లోనూ మంచిపేరే ఉంది. కానీ.. రాజకీయరంగంలో ఆయన వేస్తున్న అడుగులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నత లక్ష్యంతో పార్టీ పెట్టి.., ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి.. ఇప్పుడు ఎన్నో ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు. పార్టీ పెట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే పోటీలో నిలవకుండా తెలుగుదేశం, బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించారు. అప్పుడంటే.. పార్టీ పెట్టిన కొత్త కాబట్టి జనసైనికులు కూడా ఆయన నిర్ణయాన్ని ఆమోదించారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా సొంతంగా బరిలో నిలిచి జనసేన కార్యకర్తల్లోను, అభిమానుల్లోను ఉత్సాహం నింపారు. ఘోరంగా ఓటమి పాలైనా.. ఓ నాయకుడిగా కార్యకర్తల మనస్సుల్లో నిలిచిపోయారు. అందుకే అధికారంలో లేకపోయినా ఐదేళ్లపాటు పార్టీని అంటిపెట్టుకుని చాలామంది పవన్తో కలిసి నడిచారు.
అయితే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయాలు ఆయన అభిమానులనే కాదు.. జనసేనలోని చాలా మంది కార్యకర్తలను కూడా కలిచివేస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఓ ఎత్తయితే.. ఆపార్టీతో పాటు బీజేపీ కోసం ప్రతిసారీ రాజీపడడం మరో ఎత్తుగా ఎత్తుగా మారింది. ఈక్రమంలో ఇంకెన్ని త్యాగాలు చేయాలి.. ఎవరి కోసం ఈ త్యాగాలు.. అన్న ప్రశ్నలు జనసేన కేడర్లో లేవనెత్తుతున్నాయి. 40 ఆశించాం.. 24 వచ్చాయి.. సరిపెట్టుకున్నాం.. ఇప్పుడు మరీ 21 సీట్లా..? మనల్ని.. మనమే తగ్గించుకుంటే ఎలా? మన బలాన్ని మనమే తక్కువ అంచనా వేసుకుంటే ఎలా? అంటూ పలువురు జనసేన సైనికులు ఆవేదన చెందుతున్నారు. 24 ప్రకటించాక కూడా.. 3 సీట్లను మనమే త్యాగం చేయాలనే చర్చ సామాజిక మాధ్యమాల్లో నడుస్తోంది. అదంతా పరిశీలిస్తే.. జనసైన్యం తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అధినాయకత్వం మాత్రం దూరదృష్టి గల నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రానున్న లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీ చేయాలని నిర్ణయించినట్టు చెబుతోంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజల అభ్యున్నతి కోసమే ఈ పొత్తంటూ సర్దిచెప్పుకుంటోంది. అయినప్పటికీ.. పవన్ కల్యాణ్మాత్రం శ్రేణుల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో ధైర్యశాలిగా, నిజాయితీ గల రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకుని పవన్.. తనను తాను తక్కువ చేసుకుంటూ.. జనసేన ను తక్కువ చేస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం బలపడినట్లు కనిపిస్తోంది. పొత్తులున్నా, లేకపోయినా ఆ పార్టీ సత్తా చాటుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో జనసేన ఒంటరిగా నిలబడితే గత ఎన్నికల్లో ఎదురైన పరాభవం మళ్లీ చవిచూడాల్సి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో చంద్రబాబు ఎన్ని సీట్లంటే అన్నంటికి జనసేనాని అంగీకరించినట్లు తెలుస్తోంది.
పోటీలో నిలబడిన 21 సీట్లలో పది మంది గెలిచినా.. ఈసారి అసెంబ్లీ లో జనసేన వాణి వినిపించవచ్చునని, తద్వారా రానున్న ఎన్నికలకు బలపడవచ్చునని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఏదేమైనా పవన్ అతితక్కువ సీట్లకు అంగీకరించడం జనసేన, పవన్ వీరాభిమానులకు రుచించడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE