ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం మే 13, బుధవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఇంగ్లీషు మీడియం అమలుపై ప్రభుత్వం జారీచేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారి పిల్లలు ఏ మీడియం కావాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వే నిర్వహించింది. ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కావాలని 96.17 శాతం మంది తల్లిదండ్రులు కోరుకున్న నేపథ్యంలో ఈ మీడియంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలిని (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వం కోరింది.
కాగా ఎస్సీఈఆర్టీ తన నివేదికను మే 11, సోమవారం నాడు ప్రభుత్వానికి సమర్పించింది. విద్యార్థులు తమ తమ మాతృభాషలో ప్రావీణ్యత పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో నైపుణ్యం సాదించేందుకు 1 వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్సీఈర్టీ సిఫార్సులను ప్రభుత్వం యధాతథంగా ఆమోదిస్తూ ఇంగ్లీషు మీడియం అమలుపై తాజాగా జీవో జారీ చేసింది. మైనార్టీ భాషా మీడియం పాఠశాలలను అలాగే కొనసాగనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో ఒక తెలుగు మీడియం పాఠశాలను కొనసాగించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పాఠశాల దూరంగా ఉంటే ఆ విద్యార్థులకు ప్రభుత్వమే రవాణా ఖర్చును భరిస్తుందని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu