సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ రెడీ అవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్దం అవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల ఏర్పాట్ల పైన ఈసీ వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడు దశల్లో ఎన్నికలు జరనున్నాయి.
ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2019లో ఎన్నికలు జరిగినపుడు మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ రాగా, ఏప్రిల్ 11న పోలింగ్ జరిగి.. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి కూడా మార్చి 13, 14 తేదీల్లో షెడ్యూల్ విడుదల చేస్తే.. ఏప్రిల్ 15-20 మధ్యన పోలింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మే చివరి వారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉండొచ్చనే అంచనాలున్నాయి.
నిజానికి ప్రస్తుతం ఒక్క ఏపీనే కాదు.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఎలక్షన్స్ మోడ్లోకి వెళ్లిపోయాయి. సర్వేల లెక్కలతో అభ్యర్థుల ఎంపికలు, గెలుపు వ్యూహాలపై చర్చలు, సభలు, సమావేశాలతో, నేతల మాటల తూటాలతో హీటెక్కిపోతున్నాయి. అయితే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కీలక ప్రకటన చేసిన దగ్గర నుంచీ అసెంబ్లీ ఎన్నికలు ఏ తేదీన జరుగుతాయంటూ కొత్త చర్చ మొదలయింది. 2024లో ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇక..175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో గంటా శ్రీనివాస్ రావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో.. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, తెలుగుదేశం పార్టీకి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడంతో ఎమ్మెల్యేల సంఖ్య 19కి తగ్గింది.
2019 ఆంధ్రప్రదేశ్లో15వ శాసనసభను ఏర్పాటు చేయడానికి.. 2019 ఏప్రిల్ 11 న శాసనసభ ఎన్నికలు జరిగాయి. అవి 2019 సార్వత్రిక ఎలక్షన్స్ తో పాటు జరిగాయి. 2024 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల కచ్చితమైన తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. 2024 మే లోపు ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రజాతీర్పు కోసం పోటీ పడుతున్నారు. ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ.. ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2024 ఏప్రిల్లో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు కూడా కీలకంగా మారాయి.గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన బరిలో దిగగా, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ 151, టీడీపీ 23 స్థానాల్లోనూ విజయం సాధించాయి. జనసేన పార్టీ ఒకే ఒక సీటు గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ఇప్పుడు రెండోసారి సీఎంగా రావాలని జగన్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు, కూటమి సాయంతో అయినా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE