నర్సీపట్నంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నర్సీపట్నంలో మరిడిమాంబ ఉత్సవాల్లో అయ్యన్న చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. అలాగే పండుగ అనుమతుల కోసం ఏఎస్పీ మణికంఠ చందోలును కలిసిన అయ్యన్న ఏఎస్పీతో పరుషంగా మాట్లాడినట్లు సమాచారం. నర్సీపట్నంలో ఇటీవల మరిడిమాంబ ఉత్సవాలకు రాత్రి 11 గంటల వరకు పోలీసులు అనుమతించారు. అయితే అర్ధరాత్రి దాటినా కార్యకలాపాలు కొనసాగుతుండటంతో పోలీసులు ఆపాలని ఆదేశించారు. ఈ తరుణంలో అయ్యన్నతో సహా ఇతర టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్యుద్దానికి దిగారు. తామేమీ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించటం లేదని, దేవుడి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, దీనికి ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారని పోలీసులను ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అయ్యన్న సహా అక్కడున్న ఇతర టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరిడిమాంబ ఉత్సవాలకు ఏఎస్పీ అనుమతి ఇవ్వలేదని అయ్యన్న పాత్రుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా కారణంగా వేడుకలు నిర్వహించలేదన్నారు. అధికార పార్టీ నేతలకు సభలకు అనుమతి ఇచ్చిన పోలీసులు తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అయ్యన్న పాత్రుడు, ఆయన కుమారుడు సహా మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాతవరం ఎస్సై డి శేఖరం ఫిర్యాదు మేరకు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు.. 353, 294 (ఎ,బి), 504, 505 (ఎ,బి), 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నర్సీపట్నం ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఆయన కుమారుడిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ