ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థలను సంయమనం చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో సుమారు 33 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తికి మంచి అవకాశాలున్నాయని, వీటిని వినియోగించుకోవాలని ఆయా కంపెనీలను కోరారు. ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్) సందర్భంగా దావోస్ వేదికగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి.
రూ.37 వేల కోట్ల భారీ పెట్టుబడితో ‘గ్రీన్ కో’ సంస్థ విద్యుదుత్పత్తి ప్లాంట్ నెలకొల్పడానికి సంసిద్దత వ్యక్తం చేసింది. 8 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్ ప్రాజెక్టు, 5 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 2 వేల మెగావాట్ల విండ్(పవన విద్యుత్) ప్రాజెక్టులను నెలకొల్పనుంది. దీని ద్వారా పది వేల మందికి ఉపాధి వకాశాలు కలుగనున్నాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక మరో ప్రముఖ కంపెనీ అరబిందో రియాల్టీ రూ. 28 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. 6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 2 వేల మెగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. ఇది ఏర్పాటు చేయబోయే ప్లాంట్స్ ద్వారా దాదాపు 8 వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ప్రభుత్వ అధికారులు, ఆయా సంస్థల అధిపతులు సంతకాలు చేశారు.
ఈ రెండు కంపెనీల ద్వారా మొత్తం రూ.65 వేల కోట్ల పెట్టుబడితో 14 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుదుత్పత్తి చేయనుండగా.. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ దాదాపు 18 వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించనుంది ప్రభుత్వం. ఇప్పటికే రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం అదానీ గ్రూపుతో ప్రభుత్వం సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ట్రాన్సిషన్ టు డీకార్బనైజ్డ్ ఎకానమీ’ సదస్సులో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్, ఆర్సిలర్ మిట్టల్ సీఈవో ఆదిత్య మిట్టల్, గ్రీన్కో గ్రూప్ ఎండీ, సీఈవో అనిల్ చలమలశెట్టి, దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్ తదితరులు దీనిలో పాల్గొన్నారు. కేపీఎంజీ గ్లోబల్ హెడ్ రిచర్డ్ సెషన్ మోడరేటర్గా వ్యవహరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ