శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని” సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై సీఎంఓ అధికారులు వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కోవిడ్ వలన చనిపోయిన వ్యక్తుల విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి అమానవీయంగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎంఓ కార్యాలయం ఆదేశించగా, ఆ మేరకు శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ ఘటనపై విచారణ జరిపించారు. ఈ ఘటనకు సంబంధించి పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్లను తక్షణమే సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu