ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అమలాపురంలో చోటుచేసుకున్న వరుస ఆందోళనలు, హింసాత్మక ఘటనల వ్యవహారంలో నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కీలక సూచన మేరకు కోనసీమ జిల్లాకు చెందిన కీలక నేతలు దీనికి ఆమోదం తెలిపారు. మంగళవారం మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ సహా జిల్లాకు చెందిన ఇతర సామజిక వర్గ నేతలు సీఎం జగన్ తో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని సామజిక వర్గాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనేలా చూడాలని సీఎం జగన్ సూచించగా.. అందుకు నేతలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. దీంతో గత ఏడాది అమలాపురం పట్టణంలో అల్లర్లు సహా ఆస్తులు ధ్వంసం ఘటనల్లో నమోదైన కేసులను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు తరతరాలుగా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారని గుర్తు చేసిన ఆయన, రేపటి తరాలు కూడా అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అలాగే అక్కడే జీవితాల్ని ముగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కోసారి భావోద్వేగాల మధ్య కొన్ని ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, అయితే వాటిని మరిచి పోయి, మునుపటిలా కలిసిమెలిసి జీవించాలని, లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందని సూచించారు. చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కన పెట్టాలని, తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోవాలని సూచించారు. కోనసీమలో జరిగిన ఘటనలు దురదృష్టకరం అని, దీనిని ఇంతటితో వదిలిపెట్టి ఇకపై సానుకూలంగా ముందుకు సాగాలని కోరారు. ఇక ఏపీలో ప్రజలను పార్టీల పరంగా చూడకుండా శాచురేషన్ బేసిస్ మీద పథకాలు అందిస్తున్నామని, వలంటీర్లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారని, వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ చెప్పారు. కాగా ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన కోనసీమ నేతలు ఆయనకు జిల్లా ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE