టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్ ప్రధాని మోదీ కల అని చెప్పిన చంద్రబాబు.. వికసిత్ ఏపీ మనందరి కల కావాలని కోరారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానికి తాము అండగా ఉంటామని..దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా చేయడం మోదీ వల్లే సాధ్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 11 కేంద్ర సంస్థలను తెచ్చామని.. మోదీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు.కానీ ఈ ఐదేళ్లల్లో ప్రజల జీవితాల్లో ఆనందమే లేదని… గంజాయి సరఫరా, వినియోగం పెరిగిందని అన్నారు. విధ్వంసమే జగన్ విధానంగా ఉందని .. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను కూడా తమ జేబు సంస్థగా మార్చుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇద్దరు చెల్లెళ్లను కూడా జగన్ మోసం చేశారన్న బాబు… వైఎస్పార్సీపీ పునాదులు రక్తంతో తడిచాయని.. తమ అన్నకు ఓటేయొద్దని జగన్ చెల్లెళ్లే చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు. లిక్కర్ ఆదాయాన్ని జగన్ తాకట్టు పెట్టారని, ప్రభుత్వ ఆస్తులని కూడా జగన్ తాకట్టు పెట్టేశారని ఇవన్నీ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏకు 400కు పైగా స్థానాలు రావడం ఖాయమని చెప్పారు.
మరోవైపు ఏపీలో అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.జగన్ దాష్టీకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి ప్రధాని మోదీ రావడం ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ జోస్యం చెప్పారు.
తిరుపతి వెంకన్న సాక్షిగా 2014లో మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పిన పవన్.. మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా 2024లో తమ పొత్తు పురుడు పోసుకుందని చెప్పుకొచ్చారు. 2014లో వెంకన్న ఆశీస్సులతో అప్పుడు ఎన్డీఏ విజయం సాధించిందన్న పవన్.. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో కూడా అంతకు మించిన విజయాన్ని దక్కించుకుంటామని అన్నారు. ప్రధాని డిజిటల్ ఇండియా అంటుంటే.. ఏపీ సీఎం జగన్ దాన్ని పక్కన పెట్టేసి అవినీతి చేస్తున్నారని ఆరోపించారు.
మద్యం, ఇసుకలో కూడా వైసీపీ అక్రమాలు చేస్తుందని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలిపోయాయని అన్నారు.. వైఎస్ వివేకాను హత్య చేయడమే కాకుండా.. అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని పవన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని జనసేనాని అన్నారు. అయోధ్యకు రాముడిని తెచ్చిన మోదీ ఇక్కడున్నారన్న పవన్.. చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత అంటూ విమర్శించారు. ధర్మానిదే విజయం.. కూటమిదే గెలుపు అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE