ఒకటి కాదు.. రెండు కాదు.. అధికారంలోకి వచ్చి ఏకంగా నాలుగు సంవత్సరాల 11 నెలలు.. పట్టించు కోవడం మానేసి .. ఎన్నికలకు వెళ్లబోయే ఒకే ఒక్క నెల ముందు.. టిడ్కో ఇళ్ల పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిర్వహణ లేక.. అప్పటికే మెజారిటీ ఇళ్లు దెబ్బతిన్నాయి. చెదలుపట్టాయి. టైల్స్ పాడైపోయాయి. విద్యుత్ సౌకర్యమూ లేదు. అధికారంలో ఉన్నది ఎవరైనా.. వాటిని కట్టించింది ఎవరి హయాంలోనైనా.. ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినవే కాబట్టి.. రాజకీయాలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా.. వాటిని వెంటనే పంపిణీ చేసి ఉంటే.. ఆ ఇళ్లకు ఈ దుస్థితి పట్టేది కాదని లబ్దిదారులు వాపోతున్నారు. చంద్రబాబునాయుడు హయాంలో సకల సదుపాయాలతో పూర్తి చేసి.. పంపిణీకి సిద్దంగా ఉన్న ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలో జగన్రెడ్డి నిర్లక్ష్యం కారణంగా.. మెజారిటీ ఇళ్లు పాడైపోయాయి. వాటిని మరమ్మతులు చేపట్టి ఇవ్వాల్సింది పోయి.. టిడ్కో ఇళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు ఫ్యాన్లను, రెండు ట్యూబ్ లైన్లను వైసీపీకి చెందిన వారే ఎత్తుకుపోయినా.. జగన్ సర్కారులో చలనం శూన్యం.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్తే.. టిడ్కో ఇళ్ల కోసం ప్రజలు నిలదీస్తారని ఇప్పటికైనా పంపిణీ చేసిన ప్రభుత్వం.. అందులోనూ.. స్వప్రయోజనం చూసుకుంది. నాటి ఫోన్ నెంబర్లు లేవని, ఓటీపీలు రావడం లేదని.. ఇలా రకరకాల కారణాలతో.. 500 రూపాయలు కట్టిన డీడీలు చూపినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసలైన లబ్ధిదారుల్లో కొందరిని తప్పించి వైసీపీ నేతలకు, నేతల బంధువులకు, కార్యకర్తలకు పేదల కోసం చంద్రబాబు కట్టించిన టిడ్కో ఇళ్లను అప్పనంగా అందించారు. వాటికి వైసీపీ రంగులు వేసుకుని పేదల ఇళ్లను రాజకీయంగా మార్చారు.
ఇప్పుడు అదే అధికార పార్టీకి రివర్స్ అవుతోంది. అధికారంలో ఉండగా వైసీపీ చేసిన మోసాలు.. ప్రభుత్వంలో జరిగిన లోపాలపై సామాన్యులు ఇప్పుడు పెదవి విప్పుతున్నారు. ఓట్ల కోసం వస్తున్న వైసీపీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలోనే సెంటున్నర జగన్ వర్సెస్ టిడ్కో చంద్రబాబు.. అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లకు, జగన్ ప్రభుత్వం అందించిన సెంటున్నర.. సారీ.. మునిసిపాలిటీల్లో సెంటే. ఆ స్థలంలో నిర్మిస్తున్న ఇళ్లకు తేడా చూపుతూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ టౌన్ షిప్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. అదే ఏపీ టిడ్కో. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల గృహాలు కూడా ఆత్మగౌరవంతో నివశించేలా ఉండాలని టిడ్కో ఆధ్వర్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా జి +3 అపార్ట్మెంట్ ప్రణాళికలో సుమారు ఐదు లక్షల గృహ సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వెనువెంటనే.. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో సుమారు 2.62 లక్షల ఇళ్ల ప్రాథమిక నిర్మాణం పూర్తి చేశారు. 40 నుంచి 60 అడుగుల అంతర్గత రోడ్లు, సమీపంలోనే పాఠశాల, ఆస్పత్రులు ఉండేలా పక్కా ప్రణాళికలతో టౌన్షిప్ లు నిర్మించారు. భూసేకరణ, సహా సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్లో ఉన్న మిగిలిన ఇళ్ల నిర్మాణాలపై కూడా దృష్టి సారించారు. టిడ్కో టౌన్షిప్లలో కేవలం మౌలిక సదుపాయాలకే రూ. 3,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అంతా సిద్ధమై.. లబ్ధిదారుల ఎంపిక పూర్తయి.. పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసే సమయంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ సృష్టించిన అడ్డంకులు, ఎలక్షన్ కోడ్ రావడంతో ఆ ఇళ్ల పంపిణీ ఆగిపోయింది.
తాను పేదల పక్షపాతిని, పెత్తందారులపై యుద్ధం చేస్తున్నానని చెప్పుకునే జగన్.. 2019 అధికారంలో వచ్చాక.. టిడ్కో ఇళ్ల పంపిణీని నిలిపివేశారు. చంద్రబాబు కట్టించిన ఇళ్లను పేదలకు ఇచ్చినా, ఆ క్రెడిట్ ఆయనకే పోతుందనే దురాశతో పేదల టౌన్షిప్ లపై పగ పట్టారన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. వాటిని చివరి పంపిణీ చేయకుండా అలాగే ఉంచేశారు. ఫలితంగా చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.
రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లకు, జగన్ కాలనీలకు ఉన్న తేడాను తెలుసుకుంటే.. పేదలకు ఎవరు ఎక్కువ విలువ ఇచ్చారనే విషయం స్పష్టం అవుతుంది. ఉదాహరణకు గుంటూరు పట్టణంలో చంద్రబాబునాయుడు నిర్మించిన గృహ సముదాయాలను పరిశీలిస్తే.. జగన్ సెంటున్నర ఇళ్లకు, ఏపీ టిడ్కో ఇళ్లకు మధ్య తేడాను గుర్తించవచ్చు. జీప్లస్3.. ఒక్కో బ్లాక్ కు 16 ఇళ్లు.. అలాంటి బ్లాక్ లు వరుసకు పది ఉన్నాయి. గుంటూరు నగరంలో ఉన్న ఈ ఒక్కచోటే 7000 కుటుంబాలకు టీడీపీ హయాంలో ఇళ్లు మంజూరు అయ్యాయి. పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది.. ఆ ఇళ్లన్నీ లబ్ధిదారులకు ఇవ్వబోతున్న సమయంలో వైసీపీ నాయకులు కుట్రలకు తెరలేపారు. వాటర్ ట్యాంక్ కోసం పెట్టిన సెంట్రింగ్ చెక్కను తగులబెట్టారు. ట్యాంక్ తగలబడింది కాబట్టి.. పిల్లర్లు పనికిరావు.. ఆ పిల్లర్లను మళ్లీ కింద నుంచి పై వరకు కట్టి.. వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించిన తర్వాతే ఆ ఇళ్లను పంపిణీ చేయాలని మళ్లీ వాళ్లే కోర్టులో కేసు వేశారు. ఫలితంగా పేదల కలల కల్లలయ్యాయి. ఆత్మగౌరవ గృహాలు నాలుగున్నర ఏళ్లకు పైగా నిరుపయోగంగా మారాయి.
తాజా ఎన్నికల నేపథ్యంలో ఇంకో పది రోజుల్లో ఎలక్షన్ కోడ్ వస్తుందనగా, అసలైన లబ్ధిదారుల్లో ఓ వంద మందికి ఇళ్లను ఇచ్చి.. సుమారు 300 ఇళ్లను వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇచ్చుకున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైగా.. చంద్రబాబు కట్టించిన ఆ ఇళ్లకు వైసీపీ రంగులు వేయించుకోవడం విడ్డూరంగా మారింది. ఇళ్లను పొందినప్పటికీ ఆ లబ్ధిదారుల్లో కూడా ఆనందం లేదు. ఎందుకంటే.. వాటిలో మెజారిటీ ఇళ్లు చెదలు పట్టి పాడైపోయాయి. పైపులైను వ్యవస్థ సరిగా లేదు. 500 రూపాయలు డీడీలు కట్టిన చంద్రబాబు హయాంలో ఆ ఇళ్లను లబ్ధిదారులుగా మారిన వారు.. జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా.. ఇప్పుడు 30 వేల నుంచి 40 వేల రూపాయలు మరమ్మతులు వెచ్చించాల్సిన దుస్థితి ఏర్పడింది. పేరు కోసం పాకులాడకుండా.. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇళ్లను ఇచ్చి ఉంటే.. ఇలా దారుణంగా తయారయ్యేవి కావని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులోని టిడ్కో ఇళ్లకు వెళ్లే ప్రధాని రహదారి నిర్మాణాన్ని కూడా జగన్ సర్కారు పట్టించుకోలేదు. నాడు చంద్రబాబు చేపట్టిన పనులే ఇప్పటికీ ఉన్నాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పంపిణీ చేసిన సెంటు, సెంటున్నర ఇళ్ల స్థలాలపై కూడా జనం పెదవి విరుస్తున్నారు. నాడు చంద్రబాబు గుంటూరు పట్టణంలో అపార్ట్మెంట్ సముదాయాలను నిర్మించి ఇస్తే.. నేడు గుంటూరుకు శివారు ప్రాంతాల్లో.. అడవిని తలపించే ఏరియాలో జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. జగన్ కట్టే ఇళ్లకు పునాదులు కూడా లేవు. ఇంటి నిర్మాణం కోసం ఆయన ఇస్తున్న లక్షన్నర రూపాయలలో పూరి గుడిసె కూడా రాదని లబ్ధిదారులు వాపోతున్నారు. అన్ని సదుపాయాలూ ఉన్న టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వడంలో తాత్సారం చేసిన జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే రాయలేని విధంగా.., చెప్పకూడని రీతిలో బూతులు తిడుతున్నారు. తమ ఆందోళనను, ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. టిడ్కో ఇళ్లకు మరమ్మతులు చేపట్టి.. అసలైన లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తుందని కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇస్తున్నారు. అలాగే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఉండేందుకు అనువుగా లేని జగన్ ఇచ్చిన స్థలాలను కూడా పరిశీలించి.. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలొ ఇళ్ల నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ భరోసా ఇస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY