ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. గురుకుల పాఠశాలలు, వాటికీ సంబంధించిన వసతి గృహాల్లో నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని, క్రమం తప్పకుండ తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, వీటిని మూడు దశల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేసారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికే ఎట్టి పరిస్థితుల్లోనూ యూనిఫామ్స్, పుస్తకాలు అందాలని స్పష్టం చేసారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక నామినేషన్ పోస్టులు, పనుల్లో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వాలని సూచించారు. వచ్చే సంవత్సరం నుంచి 45 సంవత్సరాలు దాటినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా వైఎస్సార్ చేయూత పధకం కింద రూ. 18,750 ఇవ్వనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. వైఎస్సార్ చేయూత కింద లబ్ధిదారులను గుర్తించే పక్రియను మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. సాలూరులో గిరిజన యూనివర్సిటీ, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల, 7 ఐటిడిఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు వేర్వేరుగా కమీషన్లు ఉండాలని, ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిధ్ధం చేయాలని అధికారులకు సూచించారు.
[subscribe]
[youtube_video videoid=yuyxfWuxKzE]