ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నాడు రాష్ట్రంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మించే నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం శంకుస్థాపన చేశారు. ముందుగా మత్స్యకారులకు చేయూతనివ్వడంలో భాగంగా రూ.3000 కోట్లతో 8 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు, రూ.225 కోట్లతో అవసరమైన అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో మత్స్యకారుల జీవితాలు దయనీయస్థితిలో ఉండటం చూశానని అన్నారు. ఏపీలో 974 కి.మీ తీరప్రాంతంతో సముద్ర తీరంలో దేశంలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ మత్స్యకారుల జీవితాలు మాత్రం ఎందుకు మారలేదని మనమంతా ఆలోచించుకోవాల్సి ఉందని అన్నారు. మన మత్స్యకారుల తక్కువ జీతానికి గుజరాత్ వంటి రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే తొలిదశలో నాలుగు ఫిషింగ్ హార్బర్లు, 25 ఆక్వాహబ్లకు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. ఆక్వా హబ్ లతో జనతా బజార్లను అనుసంధానం చేసి, జనతా బజార్లలో చేపలు, రొయ్యలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడులో మరో 3 పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధ సమయంలో ఆదాయం కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు అందించే రూ.10వేలు సాయం, డీజిల్ సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంపు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే అందించే పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం సహా మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి సీఎం వైఎస్ జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ