గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇటువంటి సమయంలో ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని సవాంగ్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సెప్టెంబర్ 11, బుధవారం నాడు టీడీపీ పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ప్రకటించిన నేపథ్యంలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలవాళ్ళు శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు వినాయక చవితి, మొహర్రం పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పల్నాడులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సవాంగ్ తెలిపారు.
మరోవైపు టీడీపీ పార్టీ బుధవారం చేపట్టబోతున్న చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఎలాంటి పోలీసుల అనుమతి లేదని గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు అన్నారు. ఆత్మకూరులో ప్రశాంత వాతావరణం నెలకొనిఉందని, ఇప్పుడు రాజకీయ నాయకులు మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి ఉద్రిక్తలు పెంచడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. గతంలో ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య గొడవలు జరిగాయని, అవి అన్ని కుటుంబ వివాదాలే అని, వాటితో రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. ఇంకోవైపు రేపు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను కలిశారు. ఐజీని కలిసిన వారిలో అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీలు నందిగం సురేష్ తదితరులు ఉన్నారు.
[subscribe]
[youtube_video videoid=gXEp3iKXxDM]