మరికొద్ది రోజుల్లో రాబోతున్న ఏపీ ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలది ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది ఏపీలోని పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటంతో.. రాష్ట్రంలోనే అది హాట్ సీట్ గా మారిపోయింది. అధికార వైసీపీ పవన్ కళ్యాణ్ను ఎలా అయినా ఓడించడమే లక్ష్యంగా రకరకాల ఎత్తులు వేస్తూ..వ్యూహాలు రచిస్తోంది.
పిఠాపురంలో ఎలా అయినా పవన్ను ఓడించడమే లక్ష్యంగా.. ఆ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు సీఎం జగన్. ఇప్పటికే వైసీపీ అనుకూల సోషల్ మీడియా సంస్థలన్నీ.. పిఠాపురంపైనే ఫోకస్ పెంచి అక్కడే ఉంటూ అధికారపార్టీకి అనుకూలంగా పని చేస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ప్రత్యర్థిగా నిలబడుతున్న కాకినాడ ఎంపీ వంగా గీత విజయం కోసం ఏపీ సీఎం జగన్ తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీత.. ప్రజరాజ్యం పార్టీ తరపున పోటీ చేసి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇప్పుడు తమకు సామాజికవర్గాల వారిగా కలిసి వస్తుందని జగన్ ఆలోచిస్తున్నారు. అలాగే సీనియర్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురంపైన ఫోకస్ పెంచి పవన్ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాను అక్కడ పోటీ చేయకపోయినా సరే పవన్ పై ఘాటైన విమర్శలు చేస్తూ పవన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు .కాపు సంఘాల సమావేశాలలో కూడా ముద్రగడ పాల్గొంటూ వైఎస్సార్సీపీ విజయం కోసం పని చేస్తున్నారు.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే నని విశ్లేషకులు అంటున్నారు ఎందుకంటే వైసీపీ ఇలా అన్ని విధాలుగా పిఠాపురాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తున్నా కూడా ఆ పార్టీ క్యాడర్లో మాత్రం గెలుస్తామన్న నమ్మకం కానీ, ధీమా కానీ కనిపించడం లేదు. అంతెందుకు ఎమ్మెల్యే అభ్యర్థి వారం రోజుల పాటు అధినేత మాట కొట్టేయలేక ప్రచారంలో దూసుకుపోయినా..ఇప్పుడు ఆమె ప్రచారం నామ్ కే వాస్తేగా జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె తన ప్రచారం కోసం డబ్బులు తీయాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. దీంతో క్యాడర్ కూడా ఆమె తరఫున ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక పవన్ ఓటమే ధ్యేయం అంటూ వైసీపీ అధినేత ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన మిథున్ రెడ్డి.. ప్రారంభంలో కొద్దిగా హడావుడి చేసినా ఇప్పుడు పిఠాపురం దరిదాపుల్లోనే పెద్దగా కనిపించడం లేదన్న టాక్ నడుస్తోంది.తప సొంత నియోజకవర్గం రాజంపేటలో గడ్డు పరిస్థితులు ఏర్పడటంతో.. పిఠాపురం సంగతి పక్కన పెట్టి తన విజయం కోసం రాజంపేటలో ఫోకస్ పెంచారు. దీంతో పిఠాపురంలో వైఎస్సార్సీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
మరోవైపు వంగాగీతకు పిఠాపురం టికెట్ కేటాయించిన దగ్గర నుంచి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పందెం దొరబాబు.. పార్టీ కార్యక్రమాలకు దూరం అయ్యారు. సీఎం జగన్ స్వయంగా ఆయనను తాడేపల్లికి పిలిపించి మరీ బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. జగన్పై కోపంతో దొరబాబు అనుచరగణం ఇప్పుడు జనసేన తరఫున సీరియస్ గా పని చేస్తుండటంతో వంగా గీతకు కొత్త తలనొప్పి తయారయింది. రేపో మాపో ఆయన జనసేన గూటికి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటు జనసేన పిఠాపురం ఇన్ చార్జ్ మకినీడి శేషు కుమారి జగన్ గూటికి చేరినా ..ఆమె వల్ల వైసీపీకి ఒరిగిందేమీ లేదన్న సంగతిని కేడర్ వెంటనే అర్ధం చేసుకుంది. మొత్తం మీద దిశ, దశ లేని ప్రచార వ్యూహాలతో, కేడర్ మధ్య సమన్వయ లోపంతో పిఠాపురంలో వైఎస్పార్సీపీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE