ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అంతగా బలం.. బలగం లేదు. పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మినహా.. గత పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ నేతలు బీజేపీలోకి రాలేదు. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కనీస ప్రభావం చూపలేకపోయింది. ఒక శాతం ఓట్లను కూడా తెచ్చుకోలేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా అధిష్ఠానం సోము వీర్రాజును నియమించింది. బాధ్యతలు చేపట్టగానే సోము మార్క్ రాజకీయాలు ప్రారంభించి హడావిడి చేశారు. అయినప్పటికీ.. ఆయన హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ పార్టీ సత్తా చాటలేదు. ఇక అప్పటి నుంచీ బీజేపీ ఏపీలో స్తబ్దుగానే ఉంది.
త్వరలో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం-జనసేనలతో బీజేపీ కూడా జట్టు కట్టింది. కూటమి వల్ల ఆ రెండు పార్టీలకు ఎంత వరకు మేలు జరుగుతున్నదో అన్న సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో బీజేపీకి మరో చాన్స్ దొరికినట్లే. జనసేన బయటి నుంచి సపోర్ట్ చేయడం.. తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో 2014లో బీజేపీ నాలుగు సీట్లలో గెలుపొందింది. ఈఎన్నికల్లో పొత్తులో భాగంగా 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి కేటాయించారు. కూటమి వైపు గాలి ఉందన్న ప్రచారం నేపథ్యంలో.. బీజేపీకి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే అదునుగా కమలం పార్టీ ఏపీలో పుంజుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
దీనిలో భాగంగానే.. డబుల్ ఇంజిన్ (కేంద్ర, రాష్ట్ర) సర్కార్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా ఏపీపై దృష్టి సారించింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ఏడు చోట్ల సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. రాయల సీమ, కోసా, ఉత్తరాంధ్రలో ఒక్కో సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని తెలిసింది. మిగతా నాలుగు సభలకు పార్టీ అగ్రనేతలు హాజరయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఎన్డీఏ(టీడీపీ, జనసేన, బీజేపీ) నేతలకు ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు అందాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదలు కొని వ్యూహాలు, ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏడు చోట్ల సభల గురించి కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగిన మొదటి ఎన్డీఏ పక్షాల ఉమ్మడి సభకు ప్రధాని మోదీ వచ్చిన విషయం తెలిసిందే. కర్నూలు లేదా కడపలో ఒక సభ ఏర్పాటు చేసి అక్కడికి కూడా మోదీని ఆహ్వానించాలని కూటమి నేతలు ఆలోచిస్తున్నారు. తెలంగాణతో పాటు, ఏపీలోనూ పుంజుకోవడానికి ఇదే చాన్స్ అని బీజేపీ భావిస్తోంది. ఈఎన్నికలను వేదికగా చేసుకుని భవిష్యత్ కోసం కూడా పునాదులను బలంగా వేసుకోవాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ నాయకత్వం సూచించినట్లు తెలిసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE