ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర తలసరి ఆదాయం పడిపోయిందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నవరత్నాలు పథకాలను సీఎం జగన్ నిబద్ధతతో కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకలకు మంత్రి నాని హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్యోగులకు పీఆర్సీ పెంచే విషయంలో గత్యంతరం లేకనే ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. పన్నుల వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖను చూసి ఐక్యంగా ఉండడం నేర్చుకోవాలని ప్రభుత్వంలోని ఇతర శాఖలకు మంత్రి సూచించారు. 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్గా నడపటం అభినందనీయమని కొనియడారు. వైసీపీ అధికారంలోకి రావడంలో ఏపీ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అందుకే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. అసలు ఉద్యోగులపై ప్రేమ లేకపోతే ఐఆర్ 27% ఎందుకు ఇస్తుందని అన్నారు. పీఆర్సీ బాగాలేదని కొందరు అంటున్నారు, అసలు బాగాలేనిది పీఆర్సీ కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదని పేర్కొన్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా తమ ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తుందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ