ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (జూలై 4, సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. దేశంలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భీమవరం ఏఎస్ఆర్ నగర్ లో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. అనంతరం పెదమిరంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. భీమవరం పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరాను. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను. ఈ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను మరింత మెరుగుపరుస్తుంది” అని పేర్కొన్నారు.
మరోవైపు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఏపీ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, పలువురు ఏపీ మంత్రులు, బీజేపీ నేతలు, పలు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు. ముందుగా భీమవరంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవి సహా పలు పార్టీల అధినేతలకు, ప్రముఖులకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఇటీవలే ప్రత్యేక ఆహ్వానాలను పంపించారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు గౌరవార్థం వచ్చే ఒక సంవత్సరంలో అంటే జూలై 4, 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది.
ఇక హైదరాబాద్ లోని హెఛ్ఐసీసీ వేదికగా రెండ్రోజుల పాటుగా జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, జూలై 4, సోమవారం నాడు ఉదయం 9.20 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్లో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం వైఎస్ జగన్ భీమవరం వెళ్లారు. ఇక భీమవరంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించి, ఈ సందర్భంగా 30 అడుగుల ఎత్తైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే బహిరంగ సభ తర్వాత మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు, అనంతరం గుజరాత్ లోని గాంధీనగర్ కు ప్రధాని మోదీ వెళ్లనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY