మహిళలను, దేవతలని చిన్నచూపు చూసే అలవాటు మాకు లేదని తెలిపారు త్రిదండి చినజీయర్ స్వామి. ఇటీవల మేడారం సమ్మక్క, సారలమ్మ పై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈరోజు విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో చిన జీయర్ స్వామి దీనిపై మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. సమావేశంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. నిజానికి నేడు అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవమని చెప్పాలి. ఎందుకంటే, నేడు లక్ష్మీదేవి పుట్టిన రోజు. పాలసముద్రంలో పుట్టిన అమ్మవారు భగవంతుడి వద్దకు చేరిన రోజు. మహిళ శక్తికి మూలకేంద్రం, మహిళకు ఎప్పటికీ పూజ్య స్థానమే దక్కుతుంది. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరికి జ్ఞానం ఉంటే, వారికి ఆరాధ్య స్థానం కల్పించాలని రామానుజాచార్యులు చెప్పారు. మేము దానిని పాటిస్తాం అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ విశిష్ట పర్వదినాన ప్రపంచంలోని మహిళలందరికీ మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. మహిళల్ని, దేవతల్ని చిన్నచూపు చూసే అలవాటు మాకు లేదు, అలా మాట్లాడతామని అనుకోవడం పొరపాటు. దేనికైనా పూర్వాపరాలు తరచి చూడాలి. ఆదివాసీ స్త్రీలైన సమ్మక్క, సారలమ్మ లను తక్కువ చేసి మాట్లాడలేదు. గ్రామసీమల్లో వుండే వ్యక్తులైనా మేథస్సు పరంగా వారిని ఉత్తములుగా భావించాలి. వారి ప్రతిభ కారణంగానే ఆరాధ్య అర్హత పొందారు. మాకు అందరూ సమానమే. మేము ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల కోసం ఒక ప్రత్యేక స్కూలును 2004లో ప్రారంభించాం. సరైన అవకాశాలు లేకే ఆదివాసీలు వెనకబడ్డారు, అవకాశం ఉండి ఉంటే ఆదివాసీల్లో అద్భుతమైన ప్రగతి కనిపించేది. సమాజ హితం కోసం అందరం కలిసి పనిచేద్దాం, అందరినీ సమానంగా చూద్దాం. ప్రకృతిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇప్పటికీ ప్రతి పండుగకు మేము దానిని పాటిస్తున్నాం అని చిన జీయర్ స్వామి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ