హిందూత్వ విధానమే బీజేపీకి ప్రధాన అజెండా. రాముడికి కాషాయ పార్టీకి విడదీయలేని బంధం ఉంది. అయోధ్య రాముడిని ముందు పెట్టుకుని మూడు దశాబ్దాల పాటు దేశంలో రాజకీయాలను మొత్తం మార్చేలా చేసింది. 1989లో అయోధ్య రాముడినే అజెండాగా చేసుకుని రెండు సీట్ల నుంచి ఎకాఎకీన 90 సీట్లకు ఎగబాకింది బీజేపీ. ఆ తరువాత 1996 నాటికి 160 సీట్లకు చేరుకుని వాజ్పేయ్ని ప్రధాని పీఠంపై కూర్చొబెట్టింది.
ఇక అయోధ్య రామమందిరం ఇష్యూ బీజేపీకి 2014 ఎన్నికల దాకా ఉపయోగపడుతూనే ఉంది. 2019లో రెండోసారి అధికారంలోకి రావడంతో అయోధ్య ఇష్యూని బీజేపీ కోర్టు ద్వారా పరిష్కరించుకుంది. దీంతో రామమందిరం నిర్మాణానికి ఆటంకాలు లేకుండా పోయాయి. కరోనా విపత్తు వేళ 2020లో ప్రధాని నరేంద్ర మోడీ రామమందిరానికి శంకుస్థాపన చేశారు. ఇక ఈ భవ్యమైన రామమందిరం 2024 జనవరిలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలోనే బీజేపీ జమిలి ఎన్నికలు అంటోంది. అయితే రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించాల్సి ఉంది. దానికి జనవరి ముహూర్తంగా నిర్ణయించారు. బీజేపీ జమిలి ఎన్నికలు అనుకున్నా అవి డిసెంబర్లో వస్తే రామమందిరం ప్రారంభం సమయానికి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల బరిలో ఉంటుంది. అంటే లోక్ సభ రద్దు అయి కేర్ టేకర్ సర్కార్గా ఉంటుంది. అందువల్ల అది కుదిరే పని కాదు. దీంతో బీజేపీ కలల కోవెల, ఆరాధ్య దేవుడు రాముడు, రామ మందిరం వంటివి అస్త్రాలుగా లేకుండా డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లడం సాధ్యమేనా..? అన్న చర్చకు తెర లేస్తోంది.
మరోవైపు జనవరిలో జరగాల్సిన రామమందిరం ముహూర్తాన్ని కొంచెం ముందుకు అంటే డిసెంబర్కు జరిపి ప్రారంభోత్సవం చేస్తారా..? అన్న చర్చ కూడా ఉంది. అలా అయితే రామమందిరం ప్రారంభం తరువాతనే లోక్ సభ రద్దు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈలోగా చూస్తే తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు గడువు తీరిపోయి ఎన్నికలు ముంచుకు వస్తాయి. వాటిని ఆపి కొత్త ఏడాదిలో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలంటే ముందుగా అక్కడ రాష్ట్రపతిపాలన విధించాల్సి ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం లోక్ సభ రద్దు చేయకుండా ఉంటేనే ఇవన్నీ చేయగలదు. అయితే అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ని వెనక్కి జరపడానికి ఆయా రాష్ట్రాలు ఎంతవరకూ ఒప్పుకుంటాయన్నది కూడా చూడాలని అంటున్నారు. ఒక్క మధ్యప్రదేశ్ తప్ప అన్నింటా విపక్షాలే ప్రభుత్వంలో ఉన్నాయి.
ఇలాంటివి అన్నీ చూసినపుడు బీజేపీకి జమిలి ఎన్నికలను కానీ ముందస్తు ఎన్నికలను కానీ డిసెంబర్లో పెట్టడం అంత సులువు కాదని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రధాని హోదాలో రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాతే లోక్ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాముడి అండతో మరోసారి 2024లో బీజేపీ గెలవాలని చూస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాలతో కలుపుకొని జమిలి ఎన్నికలు అనుకున్నా సరే బీజేపీకి ఇపుడు ఎంతవరకూ అవకాశం ఉందన్న దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. మరి బీజేపీని మరోసారి రాముడు, రామమందిరం కరుణిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE