దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మూడో విడత పంపిణీకి సంబంధించి వ్యాక్సిన్ ధర, వ్యాక్సిన్ సేకరణ, అర్హత విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కువ సంఖ్యలో దేశప్రజలు సాధ్యమైనంత తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరం నుండి తీవ్రంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా మూడో దశలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.
దేశంలో వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తిని మరింత పెంచడానికి ప్రోత్సహిస్తామని, అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిచేసే ఇతర జాతీయ మరియు అంతర్జాతీయ కంపెనీలకు దేశంలో అనుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలు నెలవారీగా విడుదల చేసే డోసులలో 50% కేంద్రప్రభుత్వానికి, మిగిలిన 50% డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు బహిరంగ మార్కెట్ కు ఇచ్చేలా అధికారం ఇచ్చారు. రాష్ట్రాలకు, బహిరంగ మార్కెట్ కు ముందుగా నిర్ణయించిన ధరతో సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇకపై కంపెనీలనుంచి అదనపు వ్యాక్సిన్ డోసులను రాష్ట్రప్రభుత్వాలు కొనుకోవచ్చని, అదేవిధంగా 18 ఏళ్లు పైబడిన ఏ ఏజ్ గ్రూపుకైనా వ్యాక్సిన్ వేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న విధంగానే హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన జనాభాకు కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ