భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధానికి కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి ఇటీవలే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీవో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటి బ్యాచ్ 2డీజీ ఔషధ సాచెట్లను విడుదల చేశారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2డీజీ ఔషధ సాచెట్లను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అందజేయగా, ఆయన ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, ఈ 2డీజీ ఔషధం కరోనా రికవరీ సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఆక్సిజన్ డిపెండెన్సీని తగ్గిస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరులో ఈ ఔషధం ఉపయోగపడుతుందని భావిస్తున్నానని చెప్పారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు చెప్తూ అభినందించారు. కరోనా మహమ్మారిపై పోరులో డీఆర్డీవో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు.
మరోవైపు మొదటి బ్యాచ్ లో భాగంగా మొత్తం 10 వేల 2డీజీ ఔషధం సాచెట్లను సోమవారం నాడు విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. శరీరంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఈ ఔషధం అడ్డుకుంటుందని డీఆర్డీఓ వివరించింది. స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో పాటుగా, తీవ్రమైన కరోనా లక్షణాలున్న వారిలో కూడా ఇది సమర్థంగా పనిచేస్తుందని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ