భారతదేశంలో ఉపయోగిస్తున్న ఎయిర్ కండిషనర్లకు అవసరమయ్యే కరెంట్ వినియోగం 2050 నాటికి.. మరో తొమ్మిదింతలు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. ప్రస్తుతం ఆఫ్రికా ఖండం మొత్తంలో ఉపయోగిస్తున్న విద్యుత్ వినియోగానికి అది సమానమవుతుందని పేర్కొంది. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్లో ఏ దేశంలో లేనంత స్థాయిలో విద్యుత్కు గిరాకీ పెరగనుందని తెలిపింది.
2022లో 42 ఎక్సాజౌల్స్గా ఉన్న పవర్ వినియోగం 2030 కి 53.7 చేరుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. 2050 సంవత్సరానికి 73 ఎక్సాజౌల్స్లకు పెరుగుతుందని తెలిపింది. చమురు గిరాకీ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని చెప్పింది. 2022లో రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల చమురు అవసరమవగా.. 2030 సంవత్సరానికి అది 6.8 మిలియన్ బ్యారెళ్లు, 2050 సంవత్సరానికి 7.8 మిలియన్ బ్యారెళ్లకు చేరుతుందని తెలిపింది.
ఈ ఐదు దశాబ్దాల్లో భారత్లో 700 సార్లు తీవ్రమైన వడగాల్పులు వచ్చినట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. దీనివల్ల 17,000 మంది మరణించినట్లు అంచనా వేసింది. భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు ఆదాయాలు పెరగడం వల్ల కూడా మెల్లగా ఏసీల వినియోగం భారత్లో పెరుగుతోందని చెప్పింది. 2010 నుంచి చూసుకుంటే ఏసీలు వాడే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు పేర్కొంది.
అలాగే 2022తో పోలిస్తే 2030 సంవత్సరానికి గరిష్ఠ పవర్ వినియోగం 60 శాతం పెరిగే అవకాశాలున్నాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. దీంట్లో సగానికి పైగా పెరుగుదల ఏసీలు ఇతర కూలింగ్ పరికరాల వల్లేనని పేర్కొంది. పగటిపూట కూలింగ్ అవసరాలకు కొంతమంది సోలార్ పవర్ను వినియోగించుకుంటున్నా.. రాత్రి సమయాల్లో ఎక్కువ మోతాదులో కరెంట్ అవసరమవుతుందని పేర్కొంది. పవర్ వినియోగాన్ని సమర్థంగా తగ్గించే విధానాలను ఇకపై అవలంబించాల్సిన అవసరం ఉందని సూచించింది. దీనివల్ల ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీలపై చేసే ఖర్చును పునరుత్పాదక ఎనర్జీ సోర్సులలోకి మళ్లించడానికి అవకాశం ఉంటుందని తెలిపింది.
న్యూట్రల్ కర్బన ఉద్గారాల లక్ష్యం, స్వచ్ఛ ఇంధన వనరులు వంటివాటిపై దృష్టి పెడుతుండటంతో భారతదేశం కొత్త ఇంధన శకంలోకి అడుగు పెట్టబోతోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది. 2070 సంవత్సరానికి భారత్ సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటికే నిర్దేశించుకుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, సరఫరాను పెంచడం కోసం విధానాలను రూపొందించింది. 2022లో స్వచ్ఛ ఇంధనంలో భారత్ 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు గుర్తు చేసింది. 2030 సంవత్సరానికి ఆ పెట్టుబడి రెండింతలు అవుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ