గుజరాత్లోని కెవడియాలో గురువారం నాడు జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల ముగింపు సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్ధతను గుర్తుంచుకోవలసిన రోజు ఇదని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా 2008 లో ఇదే రోజు జరిగిన ముంబై ఉగ్రవాద దాడి బాధితులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. “ఆరోజున భద్రతా దళాల వీరులు, విదేశీ పౌరులు, పోలీసులు సహా పలువురు మరణించారు. వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఆ గాయాలను భారత్ ఎప్పటికి మరచిపోదు. ఈ రోజు భారతదేశం కొత్త విధానాలతో, కొత్త మార్గంతో ఉగ్రవాదంపై పోరాడుతోంది. దాడులను వీరోచితంగా ఎదుర్కొంటూ ఉగ్రవాదంతో పోరాడుతున్న భద్రతా సిబ్బందికి నమస్కరిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు భారతదేశం యొక్క అవసరం:
భారత రాజ్యాంగంలో చాలా లక్షణాలు ఉన్నాయని, కాని ఒక ప్రత్యేక లక్షణం విధులకు ఇచ్చిన ప్రాముఖ్యత అని ప్రధాని మోదీ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఈ విషయంలో చాలా ఆసక్తి చూపారు. హక్కులు మరియు విధుల మధ్య సన్నిహిత సంబంధాన్ని గాంధీ చూశారు. ఒకసారి మనం విధులను నిర్వర్తించినట్లయితే, హక్కులు వాటంతట అవే పరిరక్షించబడతాయని భావించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతి కొన్ని నెలలకు వేర్వేరు ప్రాంతాలలో ఎన్నికలు జరుగుతుండడంతో, ఆ విధానం వలన అభివృద్ధి పనులపై పడుతున్న ప్రభావం గురించి మనకందరికి తెలుసని అన్నారు. లోక్సభ, విధానసభలు, స్థానిక పంచాయతీ స్థాయిలో కూడా ఏకకాల ఎన్నికలు కోసం కామన్ ఓటరు జాబితాను ఉపయోగించవచ్చని చెప్పారు. ఒక దేశం-ఒకేసారి ఎన్నికలపై ప్రిసైడింగ్ అధికారులు అధ్యయనం చేసి, మార్గనిర్దేశం చేయవచ్చుని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ