రామేశ్వర్ అనే ఓ కూరగాయల వ్యాపారిని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలిశారు. అంతేకాదు కూరగాయల వ్యాపారి రామేశ్వర్తో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. రాహుల్ గాంధీ రామేశ్వర్తో ఉన్న ఫోటోను కూడా నెటిజన్లతో పంచుకున్నారు. రామేశ్వర్ జీ ఒక ఆత్మీయ వ్యక్తి.. ! అతనిలో, కోట్లాది మంది భారతీయుల స్నేహపూర్వక స్వభావాన్ని చూడొచ్చంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆపదలు ఎదురైనప్పుడు కూడా చిరునవ్వుతో ముందుకు సాగే వారు నిజంగా ‘భారత్ భాగ్య విధాతలు’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
X ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ ఈ ఫోటో షేర్ చేసింది. ప్రజా నాయకుడు రాహుల్ గాంధీని కలవాలనే కోరికను రామేశ్వర్ వ్యక్తం చేశారని, అందుకే రాహుల్ కలిశారని అందులో చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో అనేక మంది వ్యక్తులు పంచుకున్న చిత్రాలలో, రాహుల్, రామేశ్వర్ ఇంట్లో భోజనం చేస్తున్న ఫోటోలను పెట్టారు. కూరగాయల వ్యాపారితో రాహుల్ గాంధీ ఆత్మీయంగా కలిసి మాట్లాడుతున్న ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, రాహుల్ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
కొద్ది రోజులుగా టమాటా ధర రెండు వందల రూపాయలకు చేరువలో కొన్ని రోజులు.. వంద రూపాయల మార్కు దాటి మరికొన్ని రోజులు ఉంటూ సామాన్యుల వంటగదిలో టమాట రుచులను దూరం చేసింది. కొన్నిమార్కెట్లో కిలో నాణ్యమైన టమోటా ధర రూ.150 నుంచి రూ.170 వరకు విక్రయించారు. అయితే అలా ధరలు మండిపోతున్నప్పుడు ఢిల్లీ వీధుల్లో కూరగాయలు విక్రయిస్తున్న ఓ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ దీనగాథతో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
ఆ సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రముఖ నటుడు విజయ్ వర్మ సహా కొంతమంది ఈ వీడియో క్లిప్ను షేర్ చేసి విచారం వ్యక్తం చేశారు. జులై 20 ఉదయం రామేశ్వర్ టమాటాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీకి వచ్చాడు. అయితే అక్కడ టమాట ధర ఎక్కువగా ఉండటంతో.. కూరగాయలు కొనుక్కోలేక ఒట్టి చేతులతో ఇంటికి చేరుకున్నాడు. ఇదంతా గమనించిన ఓ యూట్యూబ్ మీడియా ప్రతినిధి.. రామేశ్వర్తో మాట్లాడుతూ అతని కూరగాయల వ్యాపారం గురించి ఆరా తీస్తుండగా రామేశ్వర్ కన్నీరుమున్నీరు అయ్యాడు. టమాటా కొనేందుకు వచ్చారా అనే ప్రశ్నకు రామేశ్వర్ సమాధానమిస్తూ టమాట కొనేందుకు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి వచ్చానని, అయితే టమాటల ధర చాలా ఎక్కువగా ఉందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ సమయంలో ఏపీఎంసీ మార్కెట్లో కిలో టమాట రూ.120 నుంచి రూ.140 పలుకుతోందని చెప్పాడు. పోనీ ఇంత ఖరీదు పెట్టి కొన్నాక.. మా సందుల్లో, వీధుల్లో కొంచెం లాభం వచ్చినా చాలని అమ్మడానికి వెళ్తే.. జనాలు కొనడానికి ముందుకు రాకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుందని రామేశ్వర్ చెప్పుకొచ్చాడు. అందుకే తాను టమాటాలు కొనడానికి ధైర్యం చేయలేదని అన్నాడు. పోనీ ఇతర కూరగాయలు కొంటారా అని అడిగితే పైసే నహీ అంటూ కూరగాయల వ్యాపారి విలపించడంతో ఆ వీడియో వైరల్గా మారింది.
కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపొతున్నాయని సామాన్యులు కన్నీరుమున్నీరవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాహుల్.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అప్పట్లో మండిపడ్డారు. ఈ వీడియోను కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు అదే కూరగాయల వ్యాపారితో రాహుల్ కలిసి భోజనం చేయడం కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సామాన్యుల కష్టాలను అర్థం చేసుకున్నవాడే నిజమైన నేత అంటూ రాహుల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE