తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ జూలై 19 నుంచి హుజూరాబాద్ నియోజవర్గంలో ‘ప్రజాదీవెన పాదయాత్ర’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వ రోజు వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాలలో ప్రజా దీవెన యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా కొండపాకలో ఈటల రాజేందర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాదయాత్రను నిలిపివేయగా, వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు ఈటల రాజేందర్ ను హైదరాబాద్ కు తరలించి, అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఈటల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు ప్రజాదీవెన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో ట్విట్టర్ వేదికగా ఈటల రాజేందర్ స్పందించారు. “పన్నెండు రోజులుగా, 222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం నా వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం. వేయాల్సిన అడుగులు, చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయి. కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయి. కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తాను” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ