హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ‘‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతీ బాధిత కుటుంబానికి 10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగాలి. పండుగకు ముందే డబ్బులు అందింతే పేదలకు ఉపయోగంగా ఉంటుంది. అందుకే రోజుకు కనీసం లక్ష మందికి ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలి’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
‘‘భారీ వర్షాలు, వరదల వల్ల 15 చోట్ల 33/11 కెవి సబ్ స్టేషన్లు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేసి, పునరుద్ధరించాం. 1,080 చోట్ల 11 కేవీ ఫీడర్లలో దెబ్బతినగా అన్నింటినీ మరమ్మతు చేశాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1215 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 1,207 ట్రాన్స్ ఫార్మర్లు మరమ్మతు చేసి, పునరుద్ధరించారు. మిగతా 8 ట్రాన్స్ ఫార్మర్లు నీటిలో మునగడంతో మరమ్మతు చేయలేకపోయాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 1145 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, 386 మరమ్మతు చేశారు. మరో 759 మిగిలి ఉన్నవి. వీటిలో 586 ట్రాన్స్ ఫార్మర్లు నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట ప్రాంతాల్లో మూసీ నదిలో మునిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,299 స్థంభాలు దెబ్బతినగా, అన్నింటినీ మరమ్మతు చేశాం. మూసీ వరదలతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి చెందిన 5,335 స్థంభాలు దెబ్బతినగా, 3,249 మరమ్మతు చేశారు. మిగతా 2,086 స్థంభాల మరమ్మతు పనులు జరుగుతున్నాయి’’ అని ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి సమీక్ష సందర్భంగా సీఎం కు వివరించారు. నీళ్లు నిలిచి ఉన్న ప్రాంతాల్లో కరెంటు పునరుద్ధరణ చేయడం ప్రమాదకరం కాబట్టి, నీళ్లు తొలగించిన ప్రాంతాలు, అపార్టుమెంట్లకే కరెంటు పునరుద్దరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu