దేశీయ ఆటో రంగంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మెదక్ జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయబోతోంది. దీనిలో భాగంగా మహీంద్రా గ్రూప్ జిల్లాలోని జహీరాబాద్లో ప్రస్తుత తయారీ కేంద్రం వద్ద రూ.1,000 కోట్లు భారీ పెట్టుబడితో ఈవీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో గురువారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసింది. ‘ఇప్పటికే ట్రాక్టర్లను తయారు చేస్తున్న ప్లాంట్లో విస్తరణ ప్రాజెక్ట్గా లాస్ట్ మైల్ మొబిలిటీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది’ అని వాహన తయారీ సంస్థ మహీంద్రా గ్రూప్ ఈడీ రాజేశ్ జెజూరికర్ ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా ఇక్కడ కంపెనీ ఇప్పటికే 2013 నుండి ట్రాక్టర్లను తయారు చేస్తోంది. దీనిద్వారా జహీరాబాద్లో అదనంగా 800-1,000 ఉద్యోగాలు లభించనున్నాయని ఆయన ప్రకటించారు.
గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని టెక్మహీంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్లో జరిగిన ‘ఎక్స్యూవీ-400’ ఫార్ములా ఎడిషన్ జనరేషన్-3 రేసింగ్ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మరియు టాలీవుడ్ ప్రముఖ నటుడు సినీ నటుడు రామ్చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో టెక్ మహీంద్రా ప్రతినిధులు సీపీ గుర్నానీ, వీంతా నయ్యర్ తదితరులు ఎంఓయుపై సంతకం చేశారు. కాగా ఈ ప్రతిపాదిత విస్తరణ కోసం అంచనా వేయబడిన పెట్టుబడి కంపెనీ లేదా దాని గ్రూప్ కంపెనీల ద్వారా ఎనిమిదేళ్ల వ్యవధిలో సుమారుగా రూ.1,000 కోట్లు ఉంటుందని అంచనా. ప్రతిపాదిత పెట్టుబడి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది తెలంగాణ ప్రభుత్వ ఈవీ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద మెగా ప్రాజెక్టుల కేటగిరీ కిందకు వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రకటన తరువాత జరిగిన చర్చల్లో భాగంగానే మహీంద్రా గ్రూప్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే భవిష్యత్తులో ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కూడా స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE