తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ భద్రత, పే స్కేలు అమలు, ప్రమోషన్ వంటి డిమాండ్లతో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు గత 50 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీఆర్ఏలు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు హైదరాబాద్ తరలిరావడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసుల్ని మోహరించారు. దీంతో కొంతసేపు నగరంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో.. వీఆర్ఏల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ అసెంబ్లీకి ఆహ్వానించారు. అసెంబ్లీ హాల్లో 15 మందితో కూడిన వీఆర్ఏ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. వీఆర్ఏ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారని, వారందరికీ పే స్కేల్, ప్రమోషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు. అలాగే వయసు పైబడిన వీఆర్ఏల విషయంలో సానుకూలంగా స్పందించాలని, వారి వారసులకు ఆయా ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ ముందుంచారు.
అనంతరం మంత్రి కేటీఆర్ వారి సమస్యలపై స్పందించారు. వీఆర్ఏల డిమాండ్ల పైన చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పారు. ఈనెల 16వ తేది నుంచి ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న కారణంగా ప్రస్తుతం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవడం కుదరదని, ఈ వేడుకలు ముగిసిన అనంతరం ఈనెల 18 తర్వాత ప్రభుత్వం మరోసారి వీఆర్ఏ ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తుందని కేటీఆర్ తెలిపారు. అలాగే జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల నేపథ్యంలో వీఆర్ఏలు తమ ఆందోళనలను విరమించాలని, తిరిగి విధుల్లో చేరాలని మంత్రి వారిని కోరారు. అయితే ప్రభుత్వంతో చర్చలు సఫలమయ్యే వరకు దాక శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని జేఏసీ నేతలు మంత్రికి తెలియజేశారు. కాగా ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ తమను పిలిచి తమ సమస్యలను తెలుసుకోవడంపై వీఆర్ఏల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY