జూలై 5 వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కళ్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన ఎదుర్కోళ్ళు, 5వ తేదీన కళ్యాణం, 6వ తేదీన రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అమ్మవారి కళ్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో అమ్మవారి కళ్యాణం, బోనాలు, ఇతర అన్నివర్గాల పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమ్మవారి కల్యాణానికి నగరం నుండే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి తోపులాటలకు అవకాశం లేకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భారీ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలలో ఎక్కడ కూడా సీవరేజి లీకేజీలు లేకుండా పర్యవేక్షించాలని వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. రహదారుల మరమ్మతులు ఉంటే ఇప్పటినుండే చేపట్టాలని చెప్పారు. రధోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా విద్యుత్ లైన్ లను సరిచేయడం, చెట్ల కొమ్మలను తొలగించడం చేపట్టాలని అన్నారు. అమ్మవారి దర్శనం, కళ్యాణం కోసం ఇచ్చే పాస్ లను డూప్లికేషన్ కు ఆస్కారం లేకుండా బార్ కోడింగ్ తో కూడిన పాస్ లను జారీ చేయాలని ఆదేశించారు. కళ్యాణం, రధోత్సవం సందర్భంగా ఆలయం వైపు రహదారులను మూసివేసి వాహనాల మల్లింపుకు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులను ఆదేశించారు.
దేవాలయ పరిసరాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎంహెఛ్ఓ డాక్టర్ వెంకట్ ను మంత్రి ఆదేశించారు. సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో కళాకారులతో భక్తులను ఆహ్లాద పరిచేలా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని చెప్పారు. ఆలయంలో ప్రభుత్వం, దాతల సహకారంతో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని చెప్పారు. అమ్మవారి కళ్యాణం తర్వాత ఆలయ అభివృద్ధి కోసం సహకరించిన దాతలు, కళ్యాణం ఏర్పాట్లను పర్యవేక్షించిన వివిధ శాఖల అధికారులను సన్మానించడం ద్వారా గౌరవించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈఓ అన్నపూర్ణ, ఆలయ కమిటీ సభ్యులు, డీఎంహెఛ్ఓ డాక్టర్ వెంకట్, ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, వాటర్ వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్ కృష్ణ, సీజీఎం ప్రభు, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత, జోనల్ కమిషనర్ రవి కిరణ్, అడిషనల్ ట్రాపిక్ డీసీపీ రంగారావు, పంజాగుట్ట ఏసీపీ గణేష్, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, ఆర్ అండ్ బీ ఈఈ రవీంద్ర మోహన్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY