తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరామర్శకు బయలుదేరిన బండి సంజయ్ కాన్వాయ్ ను భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి వచ్చి అడ్డుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన బాసర ఆర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి వెళ్తున్నానని చెప్పారు. అయినా పోలీసులు ఆయనను ముందుకు కదలనీయకపోవడంతో బండి సంజయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇది చిన్న విషయం కాదని, అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు తమ సమస్యల పరిష్కారానికి రేయింబవళ్లు నిరసన తెలుపుతున్నారని పోలీసులతో విన్నవించారు. ఆ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ట్రిపుల్ ఐటి వద్దకు వెళ్తున్నానని, అందులో తప్పేం ఉందని సంజయ్ పోలీసులను ప్రశ్నించారు.
అయితే పోలీసులు ఆయన వాదనను వినిపించుకోలేదు. దీంతో కొద్దిసేపు టోల్ ప్లాజా వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అవడంతో సంజయ్ను పోలీసు వాహనంలోకి ఎక్కించారు. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ కార్యకర్తలు, మహిళలు పోలీసు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కాన్వాయ్ ముందు ఉన్న బీజేపీ కార్యకర్తలపై స్వల్ప లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట చోటుచేసుకుంది. దీంతో జాతీయ రహదారి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించి సంజయ్ను భిక్కనూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ