తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల గడువును జూన్ 4వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ముందుగా టీఎస్పీఎస్సీ 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 26న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం గ్రూప్-1 పోస్టుల కోసం మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవగా, దరఖాస్తుల సమర్పణకు తుది గడువు మే 31, మంగళవారం రాత్రి 10 గంటలుగా నిర్ణయించారు. అయితే అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో నాలుగురోజుల పాటు అనగా జూన్ 4వ వరకు దరఖాస్తు గడువు పెంచుతూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు గ్రూప్-1 పోస్టులకు అభ్యర్థులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే దరఖాస్తుల సంఖ్య 3 లక్షలు దాటినట్టు తెలుస్తుంది. తాజాగా గడువు కూడా పెరగడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-1 కు సంబంధించి 18 విభాగాలకు చెందిన 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2014లో టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే కావడంతో పాటుగా ఒకేసారిగా అత్యధిక పోస్టులు భర్తీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ ఉండనుంది. ఈసారి గ్రూప్-1 పోస్టులు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ద్వారానే భర్తీ చేయనున్నారు. అలాగే గతంలో ఈ పోస్టుల నియామకంలో ఉన్న ఇంటర్వ్యూ ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్ పరీక్ష జూలై/ఆగస్టు 2022లో, మెయిన్స్ పరీక్ష నవంబరు/డిసెంబరు 2022 లో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రశ్నపత్రాలు తొలిసారిగా తెలుగు, ఇంగ్లీష్ తో పాటుగా ఉర్దూలో కూడా అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF