తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్ను విడుదల చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్లో ఆదివారం రాత్రి చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచీకత్తు రూ. 40 వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్కు ఆదేశాలివ్వడం సరికాదని హైకోర్టు పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా బండి సంజయ్ను అరెస్ట్ చేసిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. రాత్రి 10:50 కి సంజయ్ను అరెస్ట్ చేశారని.. 11:15 కి ఎఫ్ఐఆర్ నమోదయిందని తెలిపింది. అరెస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే, ఎఫ్ఐఆర్ లో 333 సెక్షన్ ను అదనంగా చేర్చటంపై వివరణ అడిగింది. ఇంకా, అరెస్ట్ సమయంలో జరిగిన తోపులాటలో పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారు కానీ, దానికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో మాత్రం ఎలాంటి మెడికల్ రిపోర్టులు అందించలేదని స్పష్టం చేసింది. బండి సంజయ్ పిటిషన్ కు సంబంధించి తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ