వ్యాపారవేత్తలకు, రాజకీయ నాయకులకు సాధారణంగా ఐటీ నోటీసులు ఇస్తుంటారు. కానీ దేవుళ్లకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఎక్కడైనా చూశారా?. కానీ .. తెలంగాణ దేవుళ్లకు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. పన్ను చెల్లించాలని నోటీసులు పంపించింది. కొమురవెళ్లి మల్లన్న స్వామి, దక్షిణకాశీగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్నకు, చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లతో పాటు పలువురు దేవుళ్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం దేవుళ్లకు నోటీసులు ఇవ్వడం అనే టాపిక్ రాష్ట్రంలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది.
నోటీసులు పంపించిన ఆలయాల్లో కొమురవెల్లి మల్లన్న స్వామివారి ఆలయం మొదటి స్థానంలో ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి వచ్చిన ఆదాయంపై పన్ను చెల్లించాలని ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఐటీ చట్టం 147 కింద రూ. 8,64,49,041 ట్యాక్స్ చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పన్ను సకాలంలో చెల్లించనందున మరో రూ. 3 కోట్ల జరిమానా అదనంగా చెల్లించాలని ఆదేశించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1)సీ కింద జరిమానా రూ. 3,49,71,341.. ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1) డీ ప్రకారం మరో రూ.20వేలు అదనంగా చెల్లించాలని ఐటీ శాఖ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి, బాసర సరస్వతీదేవి ఆలయానికి కూడా ఐటీ శాఖ అధికారులు ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు పంపించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రముఖ దేవాలయాలకు నోటీసులు ఇచ్చారు. తక్షణమే ట్యాక్స్ పే చేయాలని ఆలయ అధికారులను ఐటీ అధికారులు ఆదేశించారు. లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు వెల్లడించారు.
ఆలయాలకు ఐటీ శాఖ నోటీసులు పంపించడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాలకు ట్యాక్స్ చెల్లించాలని నోటీసులు పంపించడం ఏంటని అధికారులను నిలదీస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలతో వెళ్లదేసే ఆలయాలు.. కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించమంటే.. ఎలా కడుతాయని ప్రశ్నిస్తున్నారు. ఆలయాల విషయంలో ఐటీ శాఖ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అంటున్నారు. అటు పన్ని చెల్లించకపోతే జరిమానా విధించడంపై కూడా భక్తులు మండిపడుతున్నారు. కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టిన వారిని వదిలేసి.. ఆలయాలకు నోటీసులు పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.