దేశంలోనే అతిపెద్ద లోక్ సభ స్థానం.. మల్కాజ్గిరి. 31 లక్షలకు పైగా ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గం..రాబోయే లోక్ సభ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారింది. ఇక్కడ ఎంపీగా గెలిచిన వారు ముందు మంత్రిగా.. ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నారనే సెంటిమెంట్ నేతల్లో బలంగా ఉంది. దీంతో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఏ పార్టీ ఎవరిని బరిలో దింపుతోంది ? ఎవరు ఎంపీగా పాగా వేస్తారనేది ఆసక్తిగా మారింది.అటు రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.
2009లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో.. మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, కూకట్ పల్లి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ఐదు నియోజకవర్గాలతో పాటు..రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్, హైదరాబాద్ జిల్లాలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కలిపి మల్కాజ్గిరి లోక్ సభ స్థానాన్ని ఏర్పాటు చేశారు. 31 లక్షలకు పైగా ఓట్లున్న అతిపెద్ద లోక్ సభ స్థానంలో.. సుమారు 4 వేలకు పైగా బూత్ లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజలు కలిసి ఉండే మల్కాజ్గిరి నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే..అది అంత సులువైన పనేం కాదు.
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన నాయకులంతా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.దీంతో మల్కాజిగిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా… ఎమ్మెల్యేగా ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావును నిలబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కానీ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి.. తన కుటుంబ సభ్యులనే బరిలో దింపే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో ఈమధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటును కూడా గెలవలేదు.
ఇక మల్కాజిగిరి పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలను గెలిచిన బీఆర్ఎస్..ఎంపీ సీటును కూడా తామే కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన కొడుకును బరిలో దింపే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు.. తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.అలాగే అధిష్టానానికి అతి దగ్గరగా ఉండే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.. ఈ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరికితోడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మల్కాజిగిరిలో అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారట.
ఇటు మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో పైరవీలు మొదలు పెట్టారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హుజురాబాద్, గజ్వేల్ రెండు స్థానాల్లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో మరోసారి తన అదృష్ణాన్ని పరీక్షించుకోవడానికి మల్కాజిగిరిలో పోటీకి సై అంటున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు తనకే టికెట్ అన్న ధీమాతో మల్కాజిగిరిలో ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు.
మరోవైపు వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి.. మల్కాజిగిరి పార్లమెంట్ సీటుపై భారీ ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, రాంచందర్ రావు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతామని అంటున్నారు. వాళ్లతో పాటు వీరేందర్ గౌడ్ లాంటి మరికొంతమంది నేతలు తాము కూడా పోటీకి దిగుతామని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE