తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల ప్రారంభంలోనే సభలో అధికార వైసీపీ అనూహ్యంగా పెగాసస్ అంశం చర్చకు తెచ్చింది. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుందని, దీనిపై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు కూడా చేపట్టిందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో పెగాసస్ కొనుగోలు జరిగిందని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దీనిపై దృష్టి పెట్టిన అధికార వైసీపీ సభలో పెగాసస్పై చర్చకు డిమాండ్ చేసింది. పెగాసస్ కొనాలనే ప్రతిపాదన తమ వద్దకు వచ్చినట్లు అప్పటి ఐటీ మంత్రి నారా లోకేషే చెప్పారని, కావున దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని వైసీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంని కోరారు.
ఈ క్రమంలోనే పెగాసస్పై చర్చకు చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి నోటీస్ ఇవ్వగా, స్వల్ప కాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. కాగా, ఈరోజు పలు సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టిన అనంతరం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఫారిన్ లిక్కర్ సవరణ బిల్లును మంత్రి నారాయణ స్వామి ప్రవేశపెట్టనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, టూరిజం, మెడికల్ అండ్ హెల్త్.. విద్యాశాఖ సంబంధించిన బడ్జెట్ డిమాండ్ గ్రాంట్స్పై ఓటింగ్ చేపట్టనున్నారు. అయితే, మరోవైపు టీడీపీ సభ్యుల ఆందోళన నేడు కూడా కొనసాగింది. జంగారెడ్డిగూడెం మరణాలపై సభలో చర్చించాలని పట్టుబడుతూ స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని నినాదాలు చేసారు. స్పీకర్ పలుమార్లు హెచ్చరించినా టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వారిపై సస్పెన్షన్ విధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ