ఎన్నికల వేడి మొదలైన తర్వాత.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆరడుగులు ఉన్న పొడవాటి వ్యక్తి.. ప్రచారం చేస్తూ.. ఎక్కడ మాట్లాడినా అందులో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటోంది. ప్రచార ప్రయాణంలో ఆయన పడుతున్న ఇబ్బందుల వల్లనో.., ఎక్కడికెళ్లినా ప్రజలు చెబుతున్న సమస్య వల్లనో తెలీదు కానీ.. ‘‘రోడ్లు చూస్తే గుంతలే గుంతలు.. మందు చూస్తే దోచుడే.. దోచుడు..’’ అంటూ ఉన్నారు. ఆయనే తెలుగుదేశం కూటమి ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నా.. అధికార పార్టీ వైసీపీని విమర్శిస్తూ అన్నా.. ఒకటి మాత్రం వాస్తవం. గుంటూరులో ఆ మాటకొస్తే.. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిని చూస్తే.. ప్రతి ఒక్కరూ అదే అంటారు. ‘‘రోడ్లు చూస్తే గుంతలే గుంతలు.’’ అని. జంపింగ్ రోడ్లపై ప్రయాణిస్తూ.. వామ్మో.. ఇవేం రోడ్లురా బాబోయ్.. అంటూ ప్రభుత్వంపై తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్న గుంటూరు పార్లమెంట్ పరిధిలో అయితే రోడ్లు చాలా ఘోరం. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరుకురోడ్లతో ప్రజలు నరకం చూస్తున్నారు. దానికితోడు గతుకుల రోడ్లు వాహనాలను ముందుకు వేగంగా వెళ్లనీయడం లేదు. ఫలితంగా ట్రాఫిక్ ఇక్కట్లు మొదలవుతున్నాయి. సైడ్ కాలువలు సరిగా లేక.. వర్షం వస్తే, రాకపోయినా కూడా.. రహదారులపై మురుగు దర్శనం ఇస్తూ ఉంటుంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున స్థానికులకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ గ్రావెల్ రోడ్లే. భారీ వాహనం వెళ్తుంటే.. రోడ్డుపై ఉన్న దుమ్మంతా వెనుక వల్లే ద్విచక్ర వాహనదారుల కళ్లలోకే పోతుంది. దాని నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో పాపం.. కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. పొన్నూరు నియోజకవర్గంలో లింకు రోడ్లు కూడా సరిగా లేవు. రోడ్డు నిండా గుంతలే. గుంతలు. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గానికి వస్తే.. అంతర్గత రోడ్లే కాదు.. ప్రధాన దారులు కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దారులన్నీ ధ్వంసం అయ్యాయి. ఈరోడ్ల దుస్థితిపై సోషల్మీడియాలో యువత దుమ్మెత్తి పోస్తుండడం, ఎన్నికల సమీపిస్తుండడంతో కొంత కాలం క్రితం ఆదరాబాదరాగా కొన్నిచోట్ల రిపేర్లు మాత్రం చేపట్టారు. కొన్నిరోడ్లకు టెండర్లు కూడా పిలిచారండోయ్.. కానీ పనులు మాత్రం రోడ్డెక్కలేదు.
ఇప్పుడే కాదు.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి రోడ్ల గురించే పట్టించుకోలేదు. ప్రజల నుంచి ప్రతిపక్షాల వరకు విమర్శిస్తున్నా.. ఆందోళనలు చేస్తున్నా పాలకుల్లో స్పందన లేదు. ఎప్పటికప్పుడు కనీస మరమ్మతులకు కూడా రోడ్లు నోచుకోకపోవడంతో రోడ్లు అధ్వానంగా తయారై వాహనాలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పగలు అష్టకష్టాలు పడి రాకపోకలు సాగిస్తున్నా.. రాత్రుళ్లు మాత్రం ఆయా రోడ్లపైకి వెళ్లేందుకు భారీ వాహన చోదకులు సైతం భయపడుతున్నారు. ప్రధాన రహదారుల నుంచి గ్రామీణ లింకు రోడ్లు అయితే రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేవు.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 3,618 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటిలో రాష్ట్ర రహదారులు 1,039.36 కిలోమీటర్లు, పట్టణ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులు, మేజర్ జిల్లా రహదారులు 94.17 కి.మీ., జిల్లా ప్రధాన రహదారులు 1970 కి.మీ., పంచాయతీరాజ్ పరిధిలో మరో 514 కి.మీ. రోడ్లు ఉన్నాయి. వీటిలో 80 శాతం పైగా రోడ్లు శిథిలమై పోయాయి. నగరం నుంచి జిల్లా నలుమూలలకు వెళ్లేందుకు వేసిన 10 ముఖ్యమైన రోడ్లు సహా, అన్ని రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. నగర శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కొత్తగా రోడ్డు వేయకపోయినా పర్వాలేదు.. కనీసం గుంతలైనా పూడ్చండయ్యా.. గోతుల రోడ్డుపై రాకపోకలు చేయలేకపోతున్నాం.. అని ప్రజాప్రతినిధులకు ప్రజలు ఎన్నిమార్లు విన్నవించినా.. రహదారుల దుస్థితి ఇప్పటికీ.. ఆరు గుంతలు.. మూడు గతుకుల మాదిరిగానే ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY