డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం అనారోగ్యంతో ఉన్నవాళ్లు, సన్నగా ఉన్నవాళ్లు, చిన్నపిల్లలు మాత్రమే తినాలని చాలా మంది అనుకుంటారు. డ్రై ఫ్రూట్స్ తింటే లావు అవుతామని కాస్త లావుగా ఉన్నవారెవరూ వాటివైపే చూడరు. కానీ బరువు తగ్గించడంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయని..వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాదంపప్పు గురించేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పు తింటే బరువు పెరుగుతామన్నది కేవలం అపోహ, భయం మాత్రమేనని అంటున్నారు. బాదం పప్పులో బరువు తగ్గడానికి కావాల్సిన పోషకాలున్నాయంటున్నారు.
నిజానికి డ్రైఫ్రూట్స్ విషయంలో కొంత మందికి రకరకాల అపోహలుంటాయి. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని.. దాని వల్ల లావుగా అయిపోతామని అనుకుంటారు. లావుగా అయితే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని అసలు అటు వైపే చూడరు. అందులోనూ బాదంపప్పు అంటే సన్నగా ఉన్నవాళ్లకోసమే అనుకుంటారు. కానీ బాదంను రోజూ తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరానికి ఉపయోగపడే విటమిన్ ‘ఇ’తో పాటు మోనో సాచురేటెడ్ కొవ్వులు వృద్ధి చెందుతాయని అంటున్నారు.
అంతెందుకు మహిళల్లో అప్పుడప్పుడు బాదం పప్పు తినే వారి కంటే కూడా.. క్రమం తప్పకుండా బాదం తినేవారికి 35 శాతం తక్కువ గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఎందుకంటే బాదంలో తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు బరువును తగ్గించే విటమిన్ ‘ఇ’, పీచు వంటి ఎన్నో పోషకాలు బాదం పప్పులో ఉంటాయి. అందుకే ఈ టైమ్ ఆ టైమ్ అని కాకుండా రోజులో ఎప్పుడయినా 8నుంచి 10 బాదంపప్పులు తింటే మంచిదని డాక్టర్లు అంటున్నారు. అది ఉదయం పూట అయితే ఇంకా మంచిదని చెబుతున్నారు. బాదంలో ఉండే పీచు వల్ల కడుపు నిండుగా అనిపించి ఇతర చిల్లర తిళ్లపై మనసు లాగదు. అంతేకాదు శరీరానికి కూడా పీచు చాలా అవసరం.
చాలామంది బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివాళ్లు బాదంపప్పును డైలీ తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బాదంలో అధిక మొత్తంలో ఉండే మోనో సాచురేటెడ్ కొవ్వులు ఉండటం వల్ల.. అవి శరీరంలో పేరకుపోయన కొవ్వు నిల్వలపై దాడి చేస్తాయి. నిజానికి బాదంను ఎలా తిన్నా పర్వాలేదట. అంటే బాదం పప్పును నానబెట్టుకొనే తినాలని చాలామంది అంటారు కానీ నూనె లేకుండా వేయించి తిన్నా, నానబెట్టి తిన్నా, పచ్చిగా తిన్నా కూడా వాటిలోని క్యాలరీలకు జరిగే నష్టం ఏం ఉండదు. కాకపోతే రాత్రంతా నానబెట్టిన బాదం తింటే జీర్ణశక్తి మెరుగవుతుందట. బాదంపప్పును నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఆహారం ద్వారా పెరిగిన కొవ్వులు కరగడానికి లైపేజ్ దోహదం చేస్తుందట.
అంతేకాదు మిల్క్ షేక్లు, బాదం మిల్క్ రూపంలో కూడా బాదంపప్పును తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పులో ఉండే మెగ్నీషియం.. రక్తంలోని షుగర్ను అదుపు చేస్తుంది. దీంతో ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గిపోతుంది. అలాగే బాదం పప్పులో శరీరంలోని చెడు కొవ్వుల్ని తగ్గించి.. మంచి కొవ్వుల్ని పెంచే శక్తి ఉంటుంది. దీని వల్ల బరువు అదుపులో ఉండడమే కాకుండా.. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.