తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు ఓటర్లకు హామీలు గుప్పిస్తూనే.. రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు వదులుతున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఢిల్లీ పెద్దలను కదనరంగంలోకి దింపి పొలిటికల్ హీట్ పెంచుతోంది. తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఓవైపు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటిస్తూనే.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ములుగు సభలో రాహుల్, ప్రియాంక గాంధీలు.. తుక్కగూడ సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు మరింత పదును పెట్టారు. మరికొన్ని హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఎస్సీలకు 18 శాతం.. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు.. పంటలకు కనీస మద్ధతు ధర కల్పిస్తామని వివరించారు. అలాగే 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల కోసం యువత ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రియాంక గాంధీ భగ్గుమన్నారు. తెలంగాణలో మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, వైన్స్ మాఫియాతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిండిపోయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని అన్నారు. మోడీ చేతిలో బీఆర్ఎస్ రిమోట్ ఉందని చెప్పుకొచ్చారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ.. ప్రజలను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తోందని ప్రియాంక గాంధీ ఫైరయ్యారు.
అటు మహాలక్ష్మి పథకంతో మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ కూడా రూ. 500లకే అందజేస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు.. రైతు కూలీలకు ప్రతి ఏటా రూ. 12 వేలు అందిస్తామని వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం.. రూ. 4 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. ప్రకటించిన హామీలే కాకుండా.. అంతకు మించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రచారంలో వెనుక బడిందనే టాక్ వినిపించింది. దానికి చెక్ పెడుతూ టి.కాంగ్రెస్.. ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపింది. బస్సు యాత్ర చేపట్టి ప్రచారాలతో హోరెత్తిస్తోంది. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. అటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ