గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.. సంచలనాలకు నాందిగా మారుతున్నారు.. ప్రత్యర్థుల అవినీతిని తవ్వి తీస్తున్నారు. ప్రజలకు, ప్రపంచానికి కళ్లారా చూపిస్తున్నారు.. ప్రధానంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ఆటకట్టించే ప్రయత్నం చేస్తున్నారు. “ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా.. ఇదిగో చూడండి.. ప్రకృతి వనరులను ఎలా దోచుకుంటున్నారో.. అధికార పార్టీ అవినీతికి ఇదే సాక్ష్యం. ” గుంటూరు పార్లమెంట్ పరిధి పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను బట్టబయలు చేశారు.
“దళితుల, ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమ గ్రావెల్ తవ్వుకోవడానికి మీకు అనుమతులు ఎవరిచ్చారు? అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్ తవ్వించడానికా ప్రజాప్రతినిధిగా తమరు గెలిచింది? ఎక్కువ దోపిడీలు చేశారనా ఎంపీ అభ్యర్థిగా జగన్ మీకు ప్రమోషన్ ఇచ్చింది..?” అంటూ కిలారి రోశయ్యను గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. చేబ్రోలు మండలంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి డాక్టర్ పెమ్మసాని నేరుగా, డేరింగ్ గా ఆ ప్రాంతాలకు వెళ్లారు. శలపాడు, వీర నాయకుని పాలెం తదితర గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ తవ్వకాలను స్వయంగా పరిశీలించారు. పెమ్మసానిని చూసిన స్థానికులు ఆయన వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇక్కడ మైనింగ్ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయో, తమను బెదిరించి భూములను ఎలా లాక్కుంటున్నారో వివరించారు.
స్థానికుల మాటలు విన్న పెమ్మసాని.. దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా ఆక్రమించుకొని మరీ ఈ ప్రభుత్వం తవ్వుకు పోతుందని.. దాదాపు 700 ఎకరాలకు పైగా భూముల్లో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాల్సింది పోయి.. ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి రూ. 30 లక్షలు చొప్పున స్థానిక ఎమ్మెల్యే కప్పం వసూలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వీరనాయునిపాలెంలోని అక్రమ మైనింగ్ జరుగుతున్న 60 ఎకరాల్లో 20 ఎకరాలు దళితులకు చెందినవేనని, మిగిలినవన్నీ ప్రభుత్వ భూములేనని గ్రామస్తులు చెప్పినట్లు వెల్లడించారు. వందల కొద్దీ అడుగులు తవ్వుకుంటూ పోవడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలో ప్రతి ఎకరా అక్రమ తవ్వకానికి 30 లక్షలు చొప్పున.. గడిచిన నాలుగున్నర ఏళ్లలో అక్షరాలా రెండు వేల వంద కోట్ల రూపాయలను ఈ వైసీపీ నాయకులు దిగమింగారని ఆరోపించారు. ఈ నాయకులను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం భూస్థాపితం అవుతుందని ప్రజలను హెచ్చరించారు. తవ్విన అక్రమ గ్రావెల్ ను రియల్ ఎస్టేట్, డెవలప్ మెంట్ లకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాగే అక్రమ రవాణా లో భాగంగా కొట్టుకుపోయి, భారీ గుంతలు ఏర్పడ్డ రోడ్లను పరిశీలించిన పెమ్మసాని అవాక్కయ్యారు. వామ్మో.. ఏంటీ రోడ్లు, అయ్యో.. ఎంత ఇబ్బందులు పడుతున్నారో కదా.. స్థానికులు అని ఆవేదన వ్యక్తం చేశారు.
“కిలారి రోశయ్య గారు.. పక్కా లోకల్ అని ఫ్లెక్సీల్లో పెట్టుకుంటున్నారు.. ఇదేనా లోకల్ అంటే.. ఈ పనులు చేయడానికా.. మిమ్మల్ని ప్రజలను ఎమ్మెల్యేగా గెలిపించింది.. ఎంత తవ్వితే అంత ప్రమోషన్స్ ఇచ్చే పరిస్థితి తెచ్చారు.. జగన్మోహన్ రెడ్డిగారు. ఒక నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యే చాన్స్ ఇస్తేనే.. ఇంతలా తవ్వేసారే.. ఇన్ని కోట్లు దోచుకున్నారే.. ఇక పార్లమెంట్ కే అవకాశం ఇస్తే.. ఏడు నియోజకవర్గాలనూ దోచేస్తారు..” అని కిలారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలుగువారు ఆలోచించండి.. గుంటూరు ప్రజలారా.. ఈ అక్రమాలు కళ్లారా చూడండి.. ఇలాంటి వారికి అధికారం ఇస్తే.. ఇంకా ఏమేం తవ్వేస్తారో.. అయినా ఓట్లు వేస్తామంటే మీ ఖర్మ..” అని పెమ్మసాని ప్రజలకు విన్నవించారు.
ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ కిలారి రోశయ్య దోపిడీలు కళ్లారా చూసి, చూసి ప్రపంచానికి చూపించాలని వచ్చిన పెమసానికి ధన్యవాదాలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న అక్రమం గ్రావెల్ రవాణా వల్ల పంట పొలాలే కాదని, మనుషులు కూడా మట్టి కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీని ధ్యేయంగా, సహజ వనరులను ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపాలనకు చరమగీతం పాడాలన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY