తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దీనిపై విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కాగా ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్ర ఉందని, ఆయన సొంత మండలంలో దాదాపు వంద మందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని తమకు అందజేయాల్సిందిగా సిట్ కోరింది. ఈ నేపథ్యంలోనే నేడు ఆయన సిట్ ఎదుట హాజరుకానుండగా.. టీ-కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సిబ్బందిని భారీగా మోహరించి కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే వీహెచ్, మల్లురవి, అద్దంకి దయాకర్ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.
ఇక నిన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైను కలిసి టీఎస్పీఎస్సీపేపర్ లీకేజీ అంశంపై ఫిర్యాదు చేశారు. ఇక ఇదిలా ఉండగా బుధవారం గాంధీభవన్లో జరిగిన ఉగాది వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రముఖ పంచాంగకర్త చిలుకూరి శ్రీనివాస మూర్తి ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు మంచి ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యాలు కలగాలని రేవంత్ ఆకాంక్షించారు. కాగా ప్రస్తుతం పాదయాత్ర నుంచి కొద్దిపాటి విరామం తీసుకుంటున్న రేవంత్ రెడ్డి తిరిగి మార్చి 27న జుక్కల్ నుంచి పునఃప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE